ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయం!: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట
విజయవాడ : టీడీపీ కేబినెట్ విస్తరణపై.. వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే తుది నిర్ణయం అధినేతదే కాబట్టి.. ఆయన్నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ విషయంలో అందరికంటే ముందుగా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి అదృష్టం కలిసొచ్చినట్టుగానే ఉంది.
త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో.. అమరనాథరెడ్డికి మంత్రి పదవి ఖాయం చేసేశారట పార్టీ అధినేత చంద్రబాబు. తొలుత పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్.. అమరనాథరెడ్డికి మంత్రిపదవి ఇచ్చే విషయమై సానుకూలంగా స్పందించగా.. ఆపై చంద్రబాబు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అమరనాథరెడ్డికి కేటాయించబోయే శాఖను కూడా ఆయనతో వెల్లడించిన లోకేశ్.. విషయాన్ని మాత్రం ఇప్పుడే ఎవరికీ చెప్పవద్దని ఆదేశాలు జారీ చేశారట.
చాలాకాలం పాటు టీడీపీతో కలిసి పనిచేసిన అమరనాథరెడ్డి.. ఆమధ్య సీనియర్ నేతలు ఆయన్ను పక్కనబెట్టేయడంతో.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు ఆయన పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడంతో.. పార్టీలోని అన్ని వర్గాల నేతలతో సఖ్యత ఏర్పడింది. కాగా, టీడీపీని వీడిన తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు అమరనాథరెడ్డి.
అనంతర రాజకీయ పరిణామాల్లో.. కొద్ది నెలల క్రితమే ఆయన తిరిగి మళ్లీ టీడీపీ గూటికి చేరారు. లోకేశ్ తో గతంలో ఉన్న పరిచయాలు కూడా ఇప్పుడాయన మంత్రి పదవికి బాగానే కలిసొస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే అమరనాథరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడం పట్ల చిత్తూరు జిల్లా నేతల్లో మాత్రం అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నాయట. పార్టీని వీడి వెళ్లి వ్యక్తిని తిరిగి చేర్చుకోవడమే గాక మంత్రిపదవి కట్టడబెట్టడాలనుకోవడం పట్ల అక్కడి నేతలంతా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.