సీఎం శాఖ వర్సెస్ డిప్యూటీ సీఎం: ఇరికించబోయి ఇలా..దొరికిపోయి: ప్రభుత్వంలో కలకలం..!
డిప్యూటీ సీఎంకు చెందిన శాఖలోకి ఒక అధికారిని ఇరికించబోయి ఏసీబీనే దొరికిపోయిన ఘటన ఇది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారింది. రిజిస్ట్రేషన్ రికార్డుల్లో సొమ్ము రిజిస్ట్రార్ ను ట్రాప్ చేయాలని ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. అయితే బాధితులు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన మొత్తం వ్యవహారాన్ని తీసుకొని నేరుగా డిప్యూటీ సీఎం ముందుంచారు. దీంతో.. ఏసీబీ అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఆ డిప్యూటీ సీఎం దీని పైన సీరియస్ అయ్యారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వంలో..అధికారుల్లో కలకలం రేపుతోంది.
ఇరికించబోయి దొరికిపోయిన ఏసీబీ..
విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తో పాటుగా ఆ కార్యాలయ ఉద్యోగులను అవినీతి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నిన ఏసీబీ అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఈ నెల 9న మధ్యాహ్నం మధురవాడ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయానికి ఏసీబీ బృందం వెళ్లింది. ఆ సమయంలో పర్మిషన్పై ఇంటికి వెళ్లిపోతున్న సబ్ రిజిస్ట్రార్ టి.తారకేష్ను ఏసీబీ సీఐ గఫూర్ ఆపి.. కార్యాలయంలో కూర్చోబెట్టారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ రంగరాజు అక్కడకు చేరుకుని బయట గేటును మూయించివేసి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అయితే, ఎక్కడా డబ్బు దొరకలేదు. ఆ తర్వాత సీఐ గఫూర్ బయటకు వెళ్లి రూ.61,500 నగదును తీసుకొచ్చి రికార్డు రూమ్లోని రికార్డులో పెట్టి అక్కడే దొరికినట్లు కేసు పెట్టే ప్రయత్నం చేశారు.
సీసీ కెమేరాల్లో అసలు విషయం..
అయితే, అక్కడ కార్యాలయంలో సీసీ కెమేరాల్లో జరుగుతున్న తతంగం మొత్తం రికార్డు అవుతున్న విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించలేదు. ఏసీబీ సీఐ బయట నుంచి డబ్బు తెచ్చి రికార్డుల్లో పెట్టినట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ సొమ్ముతో లంచం తీసుకున్నట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిని బెదిరించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. ఇందుకోసం విచారణల పేరుతో వేధించారు. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీపై ఒత్తిడి తెచ్చి సబ్ రిజిస్ట్రార్ తారకేష్ను మధురవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేయించారు. ఈ వ్యవహారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ దృష్టికి బాధితులు తీసుకెళ్లారు. తీవ్రంగా స్పందించిన ఆయన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో ముఖ్యమంత్రికి దీని పైన పూర్తి సమాచారం తో కూడిన నివేదికను పంపినట్లు తెలుస్తోంది. ఏసీబీ సాధారణంగా ముఖ్యమంత్రి పరిధిలో పని చేస్తుంది. దీంతో..సీఎం కార్యాలయానికి జరిగిన విషయాన్ని నివేదించారు.
చర్యల దిశగా ఆదేశం..
సబ్ రిజిస్ట్రార్ సీసీ కెమెరాలోని ఫుటేజిని సాక్ష్యాలుగా తీసుకుని అధికారులు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ను కలిశారు. సీసీ ఫుటేజిని వీక్షించిన ఉప ముఖ్యమంత్రి తప్పు చేసిన ఏసీబీ అధికారులపై విచారణ జరిపించి.. డీఎస్పీ రంగరాజు, సీఐ గఫూర్, కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్కు లేఖ రాశారు. సీసీ ఫుటేజి సాక్ష్యాలను, సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదును ఏసీబీ డైరెక్టర్ జనరల్కు పంపించారు. ఏసీబీ అధికారుల ఒత్తిడికి తలొగ్గి సబ్ రిజిస్ట్రార్ను బదిలీ చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విశాఖపట్నం డీఐజీని సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు. అదే సమయంలో తప్పు చేయని వారిని వేధించిన ఏసీబీ వ్యవహారం పైన ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలోనూ డిప్యూటీ సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది.