మీకు అర్హత ఉంది కానీ, చంద్రబాబును కలవండి: దూళిపాళ్లతో లోకేష్
మంత్రి అయ్యేందుకు మీకు అన్ని అర్హతలు ఉన్నాయని, కానీ కొన్ని సమీకరణాల వల్ల కుదరలేదని టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ మంగళవారం అన్నారు.
అమరావతి: మంత్రి అయ్యేందుకు మీకు అన్ని అర్హతలు ఉన్నాయని, కానీ కొన్ని సమీకరణాల వల్ల కుదరలేదని టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ మంగళవారం అన్నారు.
దూళిపాళ్ల ఈ రోజు మంత్రి నారా లోకేష్ను కలిశారు. కేబినెట్లోకి తీసుకునే అర్హత మీకు ఉందని, కానీ కొన్ని లెక్కల వల్ల కుదరలేదని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలవాలని సూచించినట్లు చెప్పారు.
కాగా, కేబినెట్లో చోటు దక్కనుందుకు దూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి పలువురు సీనియర్ నేతలకు చోటు దక్కలేదు. దీంతో వారు అసంతృప్తికి లోనయ్యారు. వారిని ఇతర నేతలు, చంద్రబాబు బుజ్జగించారు. చాలామంది నేతలు దారిలోకి వచ్చారు. ఒకరిద్దరు మాత్రం ఆవేదనతోనే ఉన్నారు.

కాగా, అసంతృప్త నేతలకు చంద్రబాబు ఇతర పదవులు ఇస్తామని చెప్పారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బెట్టు సడలించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే నడుచుకుంటానన్నారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును ముఖ్యమంత్రి పిలిచి అక్షింతలు వేయడంతో మౌనం వహించారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సోమవారం మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడితో వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు.
మంత్రిపదవి రాలేదన్న బాధతో కార్యకర్తలు బంద్కు పిలుపునిస్తే వారించానని, పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభ్యుడు బీకే పార్ధసారథి కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లాకు మరో మంత్రి పదవి వస్తే బాగుండేదన్నారు. కాల్వ శ్రీనివాసులుకి మంత్రి పదవి రావడం మంచిదేనన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కలసి కృషిచేస్తామన్నారు.












Click it and Unblock the Notifications