గంటా సంచలన నిర్ణయం..ఆ పార్టీలోకి ఎంట్రీ..?
టీడీపీలో టికెట్ల వివాదం ముదురుతోంది. టికెట్ దక్కని నేతలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా పార్టీకి ఊడిగం చేసిన తామను కాదని వేరే వారికి టికెట్లు ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు సైతం నిరాశ తప్పలేదు. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో అసంతృప్తులు ఎక్కువగా బయటపడ్డాయి. పెందుర్తి,ఎలమంచిలి స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో.. అక్కడ టిక్కెట్లు ఆశించిన టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు సైతం రెండో జాబితాలో లేకపోవడం సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి గంటా ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియజేశారు. అయితే చంద్రబాబు గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని సూచించారు. అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా ఉండడంతో.. ఆయనపై పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే అందుకు గంటా అంగీకరించలేదు. రాజకీయాలకు అతీతంగా బొత్సతో గంటాకు సత్సంబంధాలు ఉన్నాయి.

ఇప్పుడు ఆయనపై పోటీ చేసి తమ మధ్య ఉన్న స్నేహాన్ని పాడు చేసుకోవాలని గంటా అనుకోవడం లేదు. పైగా చీపురుపల్లిలో తనకంటూ సొంత క్యాడర్ లేకపోవడంతో అక్కడ పోటీపై గంటా సముఖత వ్యక్తం చేయడం లేదు. రెండో జాబితా ప్రకటించే ముందు కూడా చంద్రబాబుతో భేటీ అయిన గంటా .. విశాఖ జిల్లాలో ఏదైనా నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరారు.అయితే చంద్రబాబు మాత్రం చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీచేయాలని మరోసారి సూచించారు. .
దీంతో గంటా శ్రీనివాసరావు మైండ్ బ్లాక్ అయింది. పొమ్మన లేక పొగ పెడుతున్నారని అర్థం చేసుకున్న గంటా.. గురువారం విశాఖలో తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి తన అనుచరులతో గంటా చర్చించారు. టీడీపీలో టికెట్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదని..పార్టీ మారేందుకు సిద్ధంగా ఉండాలని అనుచరులకు గంటా సూచించినట్టు సమాచారం. ఈక్రమంలోనే గంటా టీడీపీని వీడి జనసేన చేరాలని చూస్తున్నారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పార్టీలో చేరి పొత్తులో భాగంగా భీమిలి నుంచి జనసేన తరుఫున పోటీ చేయడానికి గంటా సిద్ధం అవుతున్నారని సమాచారం.
గతంలో ప్రజారాజ్యం పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన గంటా ..తన పాత పరిచియాలతో జనసేనలోకి వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి ద్వారా పవన్ కల్యాణ్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాలని గంటా ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం అందుతుంది. అనుచరుల సమావేశంలో దీనిపైనే ప్రధానంగా గంటా చర్చించినట్టుగా తెలుస్తోంది. గంటా టీడీపీని వీడి జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే సంకేతాలు అందుతున్నాయి. మరి గంటా రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications