'రాష్ట్రం మీ జాగీరా..? టీవీల్లో బాలకృష్ణ సినిమాలే చూడాలా..!' : చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్
విజయవాడ : ప్రస్తుత రాజకీయాల్లో ప్రతి రాజకీయ పార్టీకి మీడియా మేనేజ్ మెంట్ పరిపాటిగా మారిపోయింది. ప్రత్యక్ష యుద్దాలకు బదులు టీవీ ఛానెళ్ల ద్వారా.. పార్టీల నడుమ పరోక్ష యుద్దాలు జరుగుతున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లోను మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. తాజాగా వైసీపీ అనుకూల ఛానెల్ సాక్షి ప్రసారాలను రాష్ట్రంలో నిలిపేయడంతో వైసీసీ నేతలు చంద్రబాబు సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తాజాగా విజయవాడలో తలపెట్టిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించిన పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. సొంత డబ్బా కొట్టించుకునేందుకే సీఎం చంద్రబాబు మీడియాను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.
చంద్రబాబు అవినీతి-చిల్లర రాజకీయాలపై సాక్షి ఛానెల్ ఫోకస్ చేస్తున్నందుకే సాక్షి ప్రసారాలను నిలిపేశారని కొడాలి నాని ఆరోపించారు. ఇదే అంశంపై మరింత పదునైన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, రాష్ట్రం ఏమైనా మీ జాగీరా..? అని ప్రశ్నించారు. 'టీవీలో మీ బావమరిది, మీ తమ్ముడి కొడుకు సినిమాలనే చూడాలా..? జనానికి నచ్చిన ఛానెల్ చూడనివ్వరా..! అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
సాక్షి ఛానెల్ ప్రసారాలను తిరిగి పునరుద్దరించకపోతే పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తాయని చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు కొడాలి నాని. తాము తలుచుకోవాలే గానీ రాష్ట్రంలో మరే ఛానెల్ ఉండదని ప్రకటించిన నాని, చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేసినంత మాత్రానా ఛానెల్ ని అడ్డుకోవాలని చూడడం దారుణమన్నారు.
చంద్రబాబుకు జగన్ ఫీవర్ :
ఇక ఇదే సమావేశంలో మాట్లాడిన మరో వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన.. సీఎం చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫీవర్ పట్టుకుందని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతోనే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించిన కల్పన.. నవ నిర్మాణ దీక్షలోను చంద్రబాబు జగన్ పేరునే ఎక్కువగా తలుచుకున్నారన్నారు.