కనీస జ్ఞానం లేదా?, నేనంటే అంత చులకనా?: జగన్ పార్టీ ఎమ్మెల్యే సీరియస్
రైల్వే కోడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప: రైల్వే కోడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ నూతన భవన ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం పంపకపోవడంపై ఆయన మండిపడ్డారు.
ప్రొటోకాల్ పాటించడం కూడా తెలియదా? అంటూ వ్యవసాయ శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం, ఏఓ మల్లికలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన ప్రారంభోత్సవానికి హాజరైన కోరముట్ల మాట్లాడుతూ.. ఎమ్మెల్యేనైన తనకు ఆహ్వానం పంపాలన్న కనీస జ్ఞానం కూడా లేదా? అంటూ ధ్వజమెత్తారు.
తనను అవమానించినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తానని హెచ్చరించారు. ఈ విషయాన్న అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, స్పీకర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.
ఎమ్మెల్యే అంటే అంత చులకనగా ఉందా? అంటూ నిప్పులు చెరిగారు. రైతులకు ఎంతో ముఖ్యమైన వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగు మందులను ఇవ్వాల్సిన అధికారులు సక్రమంగా పని చేయడం లేదని ఆరోపించారు.