బండి సంజయ్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది... వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్...
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇటీవలి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో మంటలు రేపుతున్నాయి. బైబిల్ పార్టీ,భగవద్గీత పార్టీ అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బండి సంజయ్పై విరుచుకుపడ్డారు. సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. బైబిల్, ఖురాన్, భగవద్గీత కలిస్తేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని సంజయ్ గుర్తెరగాలన్నారు. ఇటీవల విగ్రహాలపై జరుగుతున్న దాడులు,తిరుపతి ఉపఎన్నికను ఉద్దేశించి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు వరుసపెట్టి కౌంటర్స్ ఇస్తున్నారు.
Recommended Video
చంద్రబాబును లోపలేస్తే...: మల్లాది
ప్రజలను రెచ్చగొట్టడంలో టీడీపీ, బీజేపీ సిద్ధహస్తులని మల్లాది విష్ణు విమర్శించారు. ఏపీలో ఒక్క చంద్రబాబును లోపలేస్తే రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని,సంప్రాదాయాలను కాపాడటంలో ప్రభుత్వం ముందుండి పనిచేస్తోందన్నారు. ఆలయాలపై దాడుల విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు సిద్దమైందని... త్వరలో ఒక జీవో కూడా వస్తుందని స్పష్టం చేశారు.శుక్రవారం(జనవరి 8) విజయవాడలో ఆలయాల పునరుద్దరణకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
హిందూ మత ద్రోహి చంద్రబాబు : మల్లాది
ఏపీలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. ఆయన హిందూ మత ద్రోహిగా తయారవుతున్నారని విమర్శించారు. అధికారం ఉంటే కులంతో, అధికారం లేకపోతే మతంతో చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఎన్నో ఆలయాలను కూల్చేశారని... తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చింది టీడీపీ కాదా? అని ప్రశ్నించారు. ఇంద్రకీలాద్రిపై క్షుద్ర పూజలు చేసింది మీరు కాదా? అని నిలదీశారు. అమరావతి డిజైన్లో అమరేశ్వరుని బదులు బుద్ధుడిని ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తుంగభద్ర పుష్కరాలు జరిగితే చంద్రబాబు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబుకు హిందూ మతం గుర్తులేదా? అని నిలదీశారు.
బండి సంజయ్కి కౌంటర్స్..
వైసీపీ నేతలంతా వరుసబెట్టి బండి సంజయ్ వ్యాఖ్యలను కౌంటర్ చేస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు బుధవారం(జనవరి 7) సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ ఒక కార్పోరేటర్ స్థాయి నాయకుడని... మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని అంబటి హెచ్చరించారు. ఇది తెలంగాణ కాదు.. సీఎం జగన్ పాలిస్తున్న ఏపీ అని చురకలంటించారు.అనవసరమైన మాటలతో ఏపీ ప్రజల మధ్య చిచ్చుపెట్టడం సరికాదన్నారు.