మొన్న మల్లారెడ్డి.. ఇప్పుడు రోహిత్ రెడ్డి: ఏపీలో సరైన నాయకత్వం లేదని వ్యాఖ్యలు!!
మొన్నటికి మొన్న మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే సీఎం కేసీఆర్ కు పట్టం కట్టాలని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన అన్నారు. ఇక తాజాగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఏపీ రాజకీయాల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ నుండి బీఆర్ఎస్ కు టచ్ లో చాలామంది నేతలు
టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారడాన్ని దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో మార్పు రావాలి అంటే అది బి ఆర్ ఎస్ తోనే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి టచ్లో ఉన్నారని త్వరలో వారంతా పార్టీలో చేరతారని పేర్కొన్నారు. సరైన నాయకత్వం లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని పైలెట్ రోహిత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

పేర్ని నాని వ్యాఖ్యలకు పైలట్ రోహిత్ రెడ్డి కౌంటర్
అంతకుముందు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన పైలెట్ రోహిత్ రెడ్డి దొంగ కరెంటు తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి లేదని, తమకు కేటాయించిన విద్యుత్ ని తాము తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు ఏపీలో బీఆర్ఎస్ పై చర్చ మొదలైందని, కెసిఆర్ పాలన ఏపీలో కూడా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పైలెట్ రోహిత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఏపీలో కూడా అటువంటి అభివృద్ధి కావాలని ప్రజలు భావిస్తున్నట్లుగా పైలట్ రోహిత్ రెడ్డి వెల్లడించారు.

ఏపీ అభివృద్ధి తెలంగాణా అడ్డుకుంటుందన్నవ్యాఖ్యల్లో వాస్తవం లేదు
ఏపీకి చెందిన పలువురు నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరారు అని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కెసిఆర్ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారని పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఇక ఏపీ అభివృద్ధిని తెలంగాణా అడ్డుకుంటున్నదన్న వ్యాఖ్యలలో వాస్తవం లేదన్నారు. గతంలో కెసిఆర్ చాలామంది ఏపీ నేతలతో పని చేశారు కాబట్టి, కెసిఆర్ గురించి తెలిసిన వాళ్ళు ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయడానికి ఆసక్తితో ఉన్నారన్నారు. ఏపీలో సరైన నాయకులు లేకపోవడం వల్లే అభివృద్ధిలో వెనుకబడిందని పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణ అభివృద్ధిలో ముందువరుసలో ఉందని, సీఎం కేసీఆర్ నాయకత్వం అందుకు కారణమని పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications