చంద్రబాబు అరెస్టుపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అరెస్టును ఖండించిన ఆయన.. తప్పుడు విధానంలో అరెస్టు చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రజల మద్దతు పెరుగుతోందన్నారు.
చంద్రబాబును చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భయపడుతున్నారన్నారు. కేసుతో సంబంధం లేకపోయినా అరెస్టు చేశారు. చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే అంతగా ఎదుగుతారు. 2024లో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని రాజా సింగ్ స్పష్టం చేశారు.

జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాజా సింగ్ మండిపడ్డారు. జగన్ ఏం చేశాడు.. ఏం చేస్తున్నాడనేది ప్రజలకు తెలుసన్నారు. ప్రజల సేవ కోసం చంద్రబాబు జైలుకు వెళ్లారు. ఆయనపై పెట్టిన కేసును కోర్టు కొట్టేస్తుందని భావిస్తున్నట్లు అని ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విజయం ఖాయమని అన్నారు.
ఇది ఇలావుండగా, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు చేస్తుండగా.. హైదరాబాద్, బెంగళూరులు నగరాల్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ ప్రధాని మోడీకి ప్రముఖ సినీ నిర్మాత కేఎస్ రామారావు లేఖ రాశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. సెప్టెంబర్ 22 వరకు చంద్రబాబుకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications