టీడీపీ ఆరిపోయే దీపం.. కాబోయే సీఎం జగనన్నే : రోజా
నగరి : టీడీపీ ప్రభుత్వ పోకడలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్యెల్యే ఆర్కే రోజా. టీడీపీ అక్రమ కేసులు బనాయిస్తోందంటూ ఆరోపించిన రోజా.. పార్టీ నేతలు, కార్యకర్తల పక్షాన తాము అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఆరిపోయే దీపం చందంగా తయారైందని ఎద్దేవా చేసిన రోజా 2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావడం ఖాయమన్నారు.
తన నియోజకవర్గమైన నగరి పట్టణ పరిధిలోని సీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రోజా. ఈ సందర్బంగా మాట్లాడిన ఎమ్మెల్యే రోజా టీడీపీపై నిప్పులు చెరిగారు. ప్రజల చేత ఛీ కొట్టించుకున్న గాలి ముద్దుకృష్ణమ నాయుడుకి ఇప్పటికీ బుద్ది రాలేదన్న రోజా, ఆ అక్కసుతో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రోటోకాల్ ను అడ్డంపెట్టుకుని, కేవలం ప్రశ్నించారన్న కారణంగా అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపించిన ఘనత ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడుకే దక్కుతుందన్నారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా.. కేజే కుమార్ కుటుంబానికి, నాయకులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
ఈటీపీ ప్లాంట్ ప్రారంభానికి అడ్డుపడుతూ, అధికారులను బెదిరిస్తోన్న నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే అయిన తనపై నగరి జాతరలో దాడి జరిగి రెండేళ్లు గడిచిపోయినా.. ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులను నిలదీశారు రోజా.
గడప గడపకు వైసీపీ కార్యక్రమం ద్వారా టీడీపీ అవినీతిని ప్రజల ద్రుష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన రోజా, 2019లో 'జగనన్న సీఎం' కావడం ఖాయమన్నారు. చంద్రబాబు మోసం గురించి ప్రజలకు తెలిసిపోయిందన్న రోజా.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఓపిగ్గా పనిచేసి 2019లో పార్టీ అధికారంలో వచ్చేందుకు క్రుషి చేయాలన్నారు.
సీవీఆర్ కళ్యాణ మండపంలో రోజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణకరరెడ్డి, జిల్లా కన్వీనర్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, పూతలపట్టు ఎమ్మెల్యే సు నీల్ కుమార్, సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జీ ఆది మూలం, రాష్ట్ర సంయుక్త కమిటీ సభ్యుడు పోకల ఆశోక్ కుమార్ పాల్గొన్నారు.