నేను అడిగితే ఇవ్వరా: తిరుమలలో రోజా సంచలన వ్యాఖ్యలు, బైక్లపై అనుచరుల హడావుడి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించే ఎల్ 1 టిక్కెట్లపై (వీఐపీ టిక్కెట్లు) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా శనివారం పట్టు పట్టారు. ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఎల్ 1 టిక్కెట్ కేటాయించకుండా అధికారులు అవమానించారని మండిపడ్డారు.
శనివారం మధ్యాహ్నం వీఐపీ దర్శనం టికెట్ల జారీ విషయంలో టిటిడి అధికారులకు, ఎమ్మెల్యే రోజాకు మధ్య వివాదం తలెత్తింది. గాలేరు- నగరి ప్రాజెక్టు సాధన కోసం నాలుగు రోజుల క్రితం పాదయాత్ర చేపట్టిన రోజా శుక్రవారం అర్ధరాత్రి తిరుమలలో యాత్ర ముగించారు.
రోజా 50 మందికి టిక్కెట్లు అడిగితే, నిబంధల మేరకు
శనివారం ఉదయం తనతో పాటు 50 మంది అనుచరులకు వీఐపీ దర్శనం కోసం టిక్కెట్లు మంజూరు చేయాలని దేవస్థానం అధికారులను రోజా కోరారు. దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల మేరకు ఎమ్మెల్యేతో పాటు 8 మందికి ఎల్ 1 టిక్కెట్లు, ఇద్దరికి ఎల్ 2 కింద జారీ చేస్తామని అధికారులు సమాచారం ఇచ్చి, వాటిని కేటాయించారు.
నేను అడిగిన వారందరికీ ఇవ్వలేదని ఆగ్రహం
అయినప్పటికీ టిక్కెట్ల కోసం రోజా పట్టుబట్టారు. దీంతో మరో పది మందికి ఎల్ 2 కింద జారీ చేసేందుకు అధికారులు అనుమతించారు. తాను కోరిన వారందరికీ టిక్కెట్లు ఇవ్వాలని, లేని పక్షంలో తనకు కేటాయించిన టిక్కెట్లు కూడా అవసరం లేదని ఆమె తేల్చి చెప్పారు.
జేఈవోపై సంచలన వ్యాఖ్యలు, అనుచరుల హడావుడి
కాలినడకన వస్తూ పొందిన దివ్యదర్శనం టోకెన్లపై శ్రీవారిని తన అనుచరులతో కలిసి దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయం ఎదుటకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు, తిరుమల జేఈవో శ్రీనివాసరాజుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదుట రోజా అనుచరులు హడావుడి చేశారు. వాహనాలపై నిలబడి ఊరేగుతూ కనిపించారు.
సూటుకేసులు అందిస్తున్నారు
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... జీఈవో శ్రీనివాస రాజు ప్రభుత్వానికి సూటుకేసులు అందిస్తున్నారని, అందుకే ఏడేళ్లుగా ఆ పదవిలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టిక్కెట్లు కేటాయించకుండా అవమానించారన్నారు. తనతో పాటు మున్సిపల్ చైర్మన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు వస్తే తగినని ఎల్ 1 టిక్కెట్లు కేటాయించలేదన్నారు.
ఎవరికి ఫిర్యాదు చేయాలో వారికే చేస్తా
8 నెలలుగా టీటీడీ బోర్డు, సాధికారక మండలి లేకపోవడంతో సర్వాధికారాలను గుప్పెట పెట్టుకొని తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చివేశారని రోజా విమర్శించారు. ఇక్కడ జరిగే అన్యాయాలను ఎవరికి ఫిర్యాదు చేయాలో వారికే చేస్తానని హెచ్చరించారు.