మీడియా పాయింట్ వద్ద అడ్డుకున్న మార్షల్స్: కంటతడి పెట్టిన రోజా
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియా పాయింట్ వద్ద కంటతడిపెట్టారు. సస్పెన్షన్కు గురైన తర్వాత శుక్రవారం సాయంత్రం చాలా సేపు సభలోనే ఉండిపోయారు.
సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పదే పదే చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. చివరకు సస్పెన్షన్కు గురైన రోజా శాసనసభ నుంచి బయటకు వెళ్తే గానీ, వైసీపీ సభ్యులకు అవకాశం ఇవ్వనని స్పీకర్ స్పష్టం చేశారు. రోజాపై సస్పెన్షన్ వేటు వేయడంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సభలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
రోజాను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని నిరసన తెలియజేశారు. దీంతో ఆమె శాసనసభ నుంచి బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వచ్చారు. ఏపీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను మీడియా పాయింట్ వద్ద మార్షల్స్ అడ్డుకున్నారు. రోజా మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకుని మాట్లాకుండా చేశారు. దీంతో రోజా కన్నీళ్లు పెట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తానెలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. అధికార పార్టీ సభ్యులు నాపై ప్రభుత్వం కక్షసాధింపుకి దిగారని అందుకే, అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.
సభ నుంచి తనను సస్పెండ్ చేసినప్పుడు, కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వరా అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను చూసి రాష్ట్ర ప్రజలు తలదించుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కాల్ మనీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రుల హస్తం ఉందని నిలదీయడంతోనే శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని రోజా తెలిపారు.
'అసెంబ్లీలో స్లోగన్స్ ఇవ్వడం తప్పా' అని ఈ సందర్భంగా రోజా ప్రశ్నించారు. తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందని, ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ లేదన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని టీడీపీ ప్రభుత్వంపై రోజా మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మహిళలు, ప్రజా సమస్యలపై ఇంకా గట్టిగా గళమెత్తుతానని ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు.