'కాపు గర్జన'కు కౌంటర్గా సుగుణమ్మ 'కొత్త వేదిక': ముద్రగడ బ్యాక్ స్టెప్!
విజయవాడ: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభంకు కౌంటర్గా ఎమ్మెల్యే సుగుణమ్మ కాపు - బీసీ ఐక్య వేదికను సోమవారం నాడు ప్రారంభించారు. తిరుపతిలోని అలిపిరి వద్ద కొబ్బరికాయ కొట్టి ఆమె ఈ ఐక్య వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ముద్రగడ పైన మండిపడ్డారు.
తునిలో ఆదివారం చోటుచేసుకున్న హింసాకాండలో కాపులెవరూ పాలుపంచుకోలేదని ఈ సందభంగా తిరుపతి ఎమ్మెల్యే, దివంగత కాపు నేత వెంకటరమణ సతీమణి సుగుణమ్మ పేర్కొన్నారు.
శ్రీవారి పాదాల చెంత ఆమె తన అనుచరులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి... కాపులు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునే దిశగా పయనించాలని ఆమె దేవుడిని ప్రార్థించారు. బీసీ- కాపు ఐక్య వేదిక పేరిట కొత్త సంస్థకు సుగుణమ్మ శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
తుని ఘటనకు కొన్ని దుష్ట శక్తులు ఈ దుర్ఘటనకు కారణమన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చడమే కాక రిజర్వేషన్లు కల్పిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రయాణీకులు భయపడ్డారు: మండలి
కాపు ఐక్య గర్జన పేరిట ఆదివారం తునిలో జరిగిన సభ హింసాత్మకంగా మారడంపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తుని ఘటన యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ తరహా ఘటనలు కాపు జాతికి శ్రేయస్కరం కాదన్నారు.
తుని ఘటనలో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనను కాపు నాయకులు ఖండించకపోవడం దారుణమన్నారు. రిజర్వేషన్ల కోసం సాగిన సభ హింసాత్మకంగా మారడం బాధాకరమన్నారు.
ఈ ఘటనతోనైనా ముద్రగడ తన చర్యలపై పునరాలోచించుకోవాలన్నారు. ఆందోళనకారులు దాడి చేసిన సమయంలో రైలులోని ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారని మండలి బుద్ద ప్రసాద్ అన్నారు. దీనిపై ముద్రగడ క్షమాపణ చెప్పాలన్నారు.
ముద్రగడ వెనుకడుగా..!?
రిజర్వేషన్ల కోసం తాము సాగిస్తున్న ఉద్యమం ఏక్క రాజకీయ పార్టీకో అనుకూలం కాదని కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం సోమవారం అన్నారు. తమ ఉద్యమంపై జరుగుతున్న విష ప్రచారంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాక సోమవారం సాయంత్రంలోగా ప్రభుత్వానికి విధించిన డెడ్లైన్ను ఆయన వెనక్కి తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన నేరుగా ప్రకటించకుండా... తన ఆమరణ దీక్షను ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నానని, నాలుగైదు రోజుల్లో చేస్తానని ప్రకటించారు.