ఎమ్మెల్యే వర్సెస్ తహసీల్దార్..! గుంటూరు జిల్లాలో వైసీపి నేతకు అవమానం..!!
అమరావతి/హైదరాబాద్ : అదికారం చేపట్టి రెండు నెలలు కూడా కాకముందే వైసిపి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అదికారులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి అప్పుడే నెత్తిపై అధికారపు కొమ్ములు వచ్చేశాయి. తమ అధినేత, సీఎం జగన్ మాదిరిగానే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగనేమో పాలనను పరుగులు పెట్టిస్తుంటే, ఆయన ఎమ్మెల్మేలు కొందరేమో, చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. రాత్రికి రాత్రే అన్నీ అయిపోవాలన్న చందంగా కొత్త ఎమ్మెల్యేలు మంకు పట్టు పట్టడం అధికారులను ఇరుకున పెడుతోంది.
ఓ ఎమ్మెల్యే ఓ తహసీల్దార్ మధ్య ఇదే వ్యవహారం చిచ్చు పెట్టింది. పబ్లిక్ గానే వాదులాడుకునేదాక వెళ్లింది. ఎమ్మెల్యే పైనే తిరగబడ్డ ఓ తహసీల్దార్ వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లిలో తాజాగా జలశక్తి అభియాన్ కార్యక్రమం జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బొల్లాపల్లి తహసీల్దార్ బి. బాలక్రిష్ణ తోపాటు జేసీ సత్యనారాయణ హాజరయ్యారు. వేదికపై నుంచి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడారు. అధికారుల తీరును తప్పుపట్టారు. 965మంది రైతుల సర్వే నంబర్లు ఆన్ లైన్ చేయాల్సి ఉండగా, 300మందివి మాత్రమే చేశారని, రైతులను ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
అదే వేదికపై ఉన్న తహసీల్దార్ బాలక్రిష్ణ సహించలేకపోయారు. అదే వేదికపై నుంచి ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు. 'నేను వచ్చి రెండు నెలలే అవుతోంది. ఆ రికార్డులపై అవగాహన లేదు. ప్రభుత్వం నుంచి పదిసార్లు ఉత్తమ అధికారిగా అవార్డు తీసుకున్న నా పైనే నిందలు వేస్తారా...?' అంటూ, ఎదురు దాడి చేశారు. 'మీకు ఇష్టం లేకపోతే ట్రాన్స్ ఫర్ చేయించుకుని వెళ్లిపోతాను' అన్నారు.
ఇలా వైసీపీ ఎమ్మెల్యే దూకుడు.. ఒక్కరోజులోనే పనులన్నీ అయిపోవాలన్న తొందర ఇప్పుడు అధికారులను ఇరుకునపెడుతోంది. ఈయన ఒక్కడే కాదు. మరికొందరు ఎమ్మెల్యేల తీరు కూడా ఇలాగే ఉంది. ఇంకొందరు ఎమ్మెల్యేల పుత్రరత్నాలు కూడా రెచ్చిపోతున్నారు. మొన్నీమధ్యన, హైదరాబాదులో ఓ వైసీపీ ఎమ్మెల్యే పుత్ర రత్నం, సీఐని తిట్టి, కాలితో తన్నాడు. వీళ్లు ఇప్పుడే ఇలా ఉన్నారు. రాబోయే ఐదేళ్లలో ఇంకెంతగా రెచ్చిపోతారో... పార్టీకి ఎలాంటి తలవంపులు తెచ్చిపెడతారో చూడాలి.