ఆస్తి వివరాలివ్వాలి: టిడిపి టార్గెట్ జగన్, కిరణ్పై కాంగ్రెస్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు తమ ఆస్తులు, అప్పుల వివరాలను సభాపతికి ఇవ్వాలని శాసన సభ బులెటిన్ సోమవారం పేర్కొంది. వారు సభ్యులుగా ప్రమాణం చేసిన నాటి నుండి నెల రోజుల లోగా వివరాలను అందజేయాలని అసెంబ్లీ ఇంఛార్జ్ కార్యదర్శి సత్యనారాయణ పేరుతో వెలువడిన బులెటిన్ కోరింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్తగా సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయడంతో వారంతా జూలై 31వ తేదీలోగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను అందజేయాలని పేర్కొంది.
జగన్ను టార్గెట్ చేసిన టీడీపీ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది! జగన్ ప్రసంగంపై ఎపి అసెంబ్లీలో టిడిపి నేతలు, జగన్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. జగన్ ప్రసంగంపై సిఎం చంద్రబాబు, మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడులు సభలోనే ధీటుగా స్పందించారు. కాంగ్రెసు పార్టీని జగన్ వెనుకేసుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కిరణ్ హయాంలోని రికార్డ్స్ ఆయన చెబుతున్నారని, అంటే కిరణ్ పాలనను ఆయన సమర్థిస్తున్నారా అని యనమల ఘాటుగా ప్రశ్నించారు.
సభ అనంతరం కూడా జగన్ పైన వారు మండిపడ్డారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. జగన్కు రుణమాఫీ పైన మాట్లాడే అర్హత లేదన్నారు. వీలైనంత త్వరగా తాము రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీపై కోటయ్య కమిటీ పూర్తి నివేదిక ఇవ్వలేదన్నారు. రైతులకు విత్తనాల కొరత రాకుండా చూస్తామన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కిరణ్ను టార్గెట్ చేసిన ఎపి కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కారణమని ఎపిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం ఢిల్లీలో ఆరోపించారు. అదిష్ఠానం పెద్దలతో సమావేశం ముగిసిన తరువాత ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత, కిరణ్ వెన్నుపోటు పొడిచిన కారణంగా ఓడిపోయామన్నారు.
విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఇతర పార్టీలు ప్రచారం చేశాయని మండిపడ్డారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడే వివాదాలకు కేంద్రం ఓ కమిటీ ఏర్పాటు చేసిందని, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నాయన్నారు.