ఎమ్మెల్సీ అనంతబాబు ఛార్జిషీటు తిరస్కరణ.. రేపు కోర్టు తీర్పుపై ఉత్కంఠ!!
తన మాజీ కారు డ్రైవర్ అయిన దళిత యువకుడు సుబ్రమణ్యంను హత్యచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్పై కాకినాడ పోలీసులు నమోదు చేసిన ఛార్జిషీటును న్యాయస్థానం తిరస్కరించింది. ఛార్జిషీటు అసంపూర్ణిగా ఉందనే కారణంతో రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం దానిని వెనక్కి పంపించింది. ఛార్జిషీటులో దర్యాప్తు అంశాలు లేకపోవడంతో న్యాయస్థానం తిరస్కరించింది.
శనివారానికి 90 రోజులు పూర్తి
ఈ ఏడాది మే 19న ఎమ్మెల్సీ మాజీ కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును మే 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. 90 రోజుల్లోగా పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయలేకపోతే నిందితుడికి బెయిల్ వచ్చే అవకాశం ఉండటంతో తాజాగా జరిగిన పరిణామం చర్చనీయాంశంగా మారింది. అనంతబాబుకు రిమాండ్ విధించి శనివారానికి 90 రోజులు పూర్తయ్యాయి.
వ్యూహాత్మకంగా వ్యవహరించారు
ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఈ విషయమై స్పందించారు. అనంతబాబును కస్టడీ పిటిషన్ నుంచి ఛార్జిషీటు వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఆరోపించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనంతబాబు మూడోసారి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఛార్జిషీటును వెనక్కి పంపించిన క్రమంలో రేపు కోర్టు తీర్పు ఏం చెబుతుందా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
పోలీసుల వైఖరిపై సందేహాలు
ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ విషయంలో పోలీసుల వైఖరిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని, నిందితుడికి బెయిల్ వచ్చేందుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఘర్షణలో మృతిచెందాడని భాస్కర్ చెబుతుండగా మృతుడి ఒంటిపై తీవ్ర గాయాలున్నాయని పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని, సిబిఐ విచారణ జరిపించాలని దళిత సంఘాలు గవర్నర్, సిఎస్కు విజ్ఞప్తి చేశాయి.