Ysrcp: రంపచోడవరంలో "నేనే రాజు.. నేనే మంత్రి"!! రంగురాళ్ల నుంచి గంజాయి వరకు..
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా కిందకు వచ్చిన రంపచోడవం నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా ఎమ్మెల్సీ అనంతబాబుకు తెలియాల్సిందే. కోట్ల రూపాయల విలువైన రంగురాళ్ల వ్యాపారం నుంచి కలప అక్రమ రవాణా, పేకాట శిబిరాలు, మట్టి తవ్వకాలు, ఇసుక దోపిడీ.. ఇలా ఒకటా.. రెండా.. అసాంఘికంగా జరిగే ప్రతి కార్యక్రమం వెనక అనంతబాబు ఉంటారని ఏజెన్సీకి చెందిన ప్రజలే చెబుతున్నారు.

కలప అక్రమ రవాణా
అడ్డతీగల మండలం గొంటువానిపాలెంలో అనంతబాబు బినామీల పేరుమీద చేపల చెరువులు, క్వారీల వ్యాపారంతోపాటు మన్యం నుంచి విలువైన కలప అక్రమంగా సరిహద్దులు దాటి వెళుతోంది. అన్నీ తెలిసినా అధికారులు దాడులు చేయకుండా మిన్నకుండిపోయారు. గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యవహారంలో అనంతబాబు మాటకు తిరుగులేదన్న ప్రచారం మన్యంలో నడుస్తోంది. ఏ అక్రమాలు జరిగినా అధికారులు ప్రశ్నించడానికి వీల్లేదని, ప్రశ్నించినా, ఎదురు తిరిగినా తనకున్న పలుకుబడితో బదిలీలు చేయిస్తారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రభుత్వాధికారి చెప్పారు.

అడ్డతీగల పోలీస్ స్టేషన్లో రౌడీషీట్
కాంట్రాక్టర్ల నుంచి ఇంజనీర్ల వరకు పెద్ద మొత్తంలో అనంతబాబుకు వాటాలు అందాలి. అడ్డతీగల పోలీస్ స్టేషన్లో మొదట ఆయన రౌడీషీటర్ గా నమోదయ్యాడు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రౌడీషీట్ తీసేశారు. అనంతబాబు జడ్పీటీసీగా ఉన్న సమయంలో మావోయిస్టులు ఆయన్ను కిడ్నాప్ చేశారు. తర్వాత ప్రజాకోర్టు నిర్వహించి హెచ్చరించి వదిలేశారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడని అనంతబాబు పేరు తెచ్చుకోవడంవల్ల ఇతర వైసీపీ నాయకులు, నేతలు కూడా ఆయనతో సౌమ్యంగానే మెలిగేవారు.

బెదిరింపులు, దందాలు సర్వసాధారణం
అనుచరులతో బెదిరింపులు, దందాలు మన్యంలో సర్వసాధారణం చేశారు. ప్రభుత్వం తరఫున ఏదైనా కార్యక్రమం జరిగినా ముందుగా ఎమ్మెల్యే వచ్చినా అనంతబాబు వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతానికి అనంతబాబును అరెస్ట్ చేయడంతో ఇక్కడి ప్రజలంతా సంతోషంగా ఊపిరి పీల్చుకుంటున్నారంటూ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications