సెటిల్మెంట్ చేసుకుంటున్న ఎమ్మెల్సీ?? కేసు నమోదు చేయని పోలీసులు?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. నిన్న ఆయన కారు వెనక సీట్లో ఆయన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. కాకినాడలో ప్రమాదం జరిగి మృతిచెందారని అనంతబాబు చెబుతున్నప్పటికీ సీసీటీవీ పుటేజ్ పరిశీలించగా ఆయన చెప్పినచోట ఎటువంటి ప్రమాదం జరగలేదని స్పష్టమైందని, దీన్నిబట్టి ఎమ్మెల్సీ అబద్దాలు చెబుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ చెప్పేది అబద్దమని తేలుతున్నప్పటికీ ఆయనపై హత్యకేసు నమోదు చేయడానికి పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ మండిపడుతున్నారు.

ప్రమాదంలో మరణిస్తే ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాలి!!
ప్రమాదంలో మరణిస్తే ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాలని, కానీ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లామంటున్నారని, ఏ ప్రయివేటు ఆసుపత్రిలో కూడా ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు కాలేదని స్థానిక టీడీపీ నేతలు వెల్లడించారు. ఒకవేళ అలాంటి కేసు వచ్చినా పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించాలని, ఇక్కడ అది కూడా జరగలేదని, వెనకసీట్లో సుబ్రహ్మణ్యాన్ని తీసుకువచ్చారని, ఇప్పుడు ఆ కారులో తాను తీసుకురాలేదని ఎమ్మెల్సీ చెబుతున్నారని, ఆయన చెబుతున్నవన్నీ అబద్దాలేననడానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలని ప్రశ్నిస్తున్నారు. అంటే ఎమ్మెల్సీ హత్యకేసు అయితే ప్రభుత్వం నుంచి మినహాయింపు ఏమైనా ఉందా? అంటూ తెలుగుదేశం, జనసేన నేతలు మండిపడుతున్నారు.

ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు
ఎమ్మెల్సీపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తటపటాయిస్తున్నారని, మీడియా ముందుకు వస్తానని చెప్పిన ఎమ్మెల్సీ అనంతబాబు తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారని, అజ్ఞాతంలోనే కేసుకు సంబంధించిన అన్ని "ఫార్మాలిటీస్" పూర్తవుతాయంటూ తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్పష్టంగా కళ్లెదుటే సాక్ష్యాధారాలు కనిపిస్తున్నప్పటికీ కేసు నమోదు చేయని పోలీసులు తీరుపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

వేరే కారులో పారిపోయిన అనంతబాబు
సుబ్రహ్మణ్యం అనంతబాబుకు రూ.30వేలు ఇవ్వాల్సి ఉందని, దాన్ని గురించి మాట్లాడుకుందాం రమ్మంటూ తీసుకువెళ్లారని, తర్వాత కారు వెనకసీటులో మృతదేహాన్ని తీసుకొచ్చి అప్పగించారని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న అనంతబాబు వెళ్లకుండా అడ్డగించినప్పటికీ ఆయన వేరే కారులో పారిపోయారు. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల వైఖరి అనుమానాస్పదంగా ఉందంటూ తెలుగుదేశం, జనసేన నేతలు ధ్వజమెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications