పెళ్లిళ్లకు హాజరవుతున్న ఎమ్మెల్సీ: పోలీసులకు మాత్రం ఆచూకీ దొరకడంలేదు!!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు వివాహాలకు హాజరవుతున్నారు. శుక్రవారం సాయంత్రం తునిలో జరిగిన శంఖవరం డిప్యూటీ తహశీల్దార్ వివాహానికి హాజరయ్యారు. అలాగే అదేరోజు రాత్రి పిఠాపురంలో ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన భద్రతా సిబ్బంది వివాహానికి హాజరయ్యారు. మరోవైపు ఎమ్మెల్సీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వివరించారు. కాకపోతే ఇంతవరకు ఎమ్మెల్సీని అరెస్ట్ చేయకపోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి ఎస్పీ మీడియా సమావేశం
శనివారం రాత్రి 10.30 గంటలకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనంతబాబును అరెస్ట్ చేస్తామని చెప్పడంతో మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ పోస్టుమార్టానికి అంగీకరిస్తూ 11.45 గంటలకు సంతకం చేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని వైద్యులు తెలిపారు. అసలు పోస్టుమార్టంలో ఏమని తేలుతుందో అనే ఉత్కంఠే ఇప్పుడు నెలకొంది.

5 సంవత్సరాలు కారు డ్రైవర్గా చేసిన సుబ్రమణ్యం
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్భాస్కర్ వద్ద ఐదు సంవత్సరాలు కారు డ్రైవర్గా పనిచేసిన సుబ్రమణ్యం అనే దళిత యువకుడు అనుమానా స్పద పరిస్థితుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. రూ.30వేలు అనంతబాబుకు సుబ్రమణ్యం ఇవ్వాల్సి ఉండగా, వాటిగురించి మాట్లాడుకుందామంటూ తీసుకువెళ్లారు. తెల్లవారుజామున కారు వెనకసీట్లో సుబ్రమణ్యం మృతదేహాన్ని తీసుకురాగా కుటుంబ సభ్యులు గొడవ చేయడంతో ఎమ్మెల్సీ వేరే కారులో పారిపోయారు.

కాకినాడలో ఉద్రిక్తత
నిన్న కాకినాడ ప్రభుత్వాస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సుబ్రమణ్యం మృతిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ నిజ నిర్థారణ బృందం ఏర్పాటు చేసింది. అయితే ఈ బృందాన్ని ఆసుపత్రిలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజుకు గాయాలవగా ఆసుపత్రిలో చికిత్సనందించారు.












Click it and Unblock the Notifications