Ysrcp: నీ రెండో కొడుకును కూడా లేపేస్తా.. ఎమ్మెల్సీ అనంతబాబు హెచ్చరిక?
మే 19వ తేదీ రాత్రి ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగిందని తేల్చిన పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. సాక్షులను విచారిస్తూ కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. హత్య జరిగినరోజు రాత్రి 7.30 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల వరకు జరిగిన పరిణామాలను ఆధారంగా చేసుకొని పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు అనంతబాబు చెప్పినదానికి, బాధితుల చెప్పినదానికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఈ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అవసరమైతే ఎమ్మెల్సీని మరోసారి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలని పోలీసులు యోచిస్తున్నారు.
నేను చెప్పినట్లు వివనకపోతే నీ రెండో కొడుకును కూడా చంపేస్తా
నేను చెప్పినట్లు వినకపోతే నీ రెండో కొడుకును చంపేస్తాననిఎమ్మెల్సీ అనంతబాబు బెదిరించారని, ఈలోగా తమ బంధువులు రావడంతో కారు వదిలేసి అక్కడినుంచి పారిపోయారని అనంతబాబు చేతిలో హత్యకు గురైన అతని కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం తల్లి నూకరత్నం పోలీసుల విచారణలో తెలిపారు. తన కొడుకును కారెక్కించుకొని కొండయ్యపాలెం నుంచి శ్రీనగర్ తీసుకువెళ్లి మరికొందరితో కలిసి చంపేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని నూకరత్నం ఆరోపించారు. అతని రహస్యాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే తమ బిడ్డను చంపేశారని ఆమె ఆవేదనకు గురయ్యారు.
రహస్యాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే..
సుబ్రమణ్యం శవాన్ని తెచ్చిన కారును అనంతబాబు వదిలేసి వెళ్లిపోవడాన్ని బట్టి చూస్తే అతని రహస్యాలు బయటకు వస్తే ఇబ్బంది అన్న ఉద్దేశంతోనే మరికొందరితో కలిసి చంపేశారని భావిస్తున్నట్లు సుబ్రమణ్యం స్నేహితుడు అరవ మణికంఠ పోలీసులకు తెలిపారు.
ఎలా మరణించాడో తెలియకుండా దహన సంస్కారాలు ఎలా చేస్తారు?
సుబ్రమణ్యం ఎలా మరణించాడో తెలియకుండా అంతిమ సంస్కారాలు చేయడం ఏమిటని నిలదీశామని, దీనికి అనంతబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కులం పేరుతో దూషించారని మణికంఠ సోదరుడు దుర్గాశివప్రసాద్ తెలిపారు. తనకు రాజకీయ పలుకుబడి ఉందని, ఎవరికీ తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, చెప్పినట్లు వినకపోతే సుబ్రమణ్యం లాగే మిగిలినవారిని కూడా లేపేస్తానని హెచ్చరించారని పోలీసులకు శివప్రసాద్ వివరించారు.