విశాఖలో సీఎం జగన్కు స్పాట్ పెడుతూ.. బీజేపీ సంచలన నిర్ణయం..
దేశ రాజకీయాల్లో ఒక అరుదైన సందర్భం ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకోబోతున్నది. తండ్రీకొడుకులు.. జాతీయ పార్టీ బీజేపీకి స్థానికంగా సారధ్య బాధ్యతలు నిర్వహించిన రికార్డును సొంతం చేసుకోబోతున్నారు. ఆ తండ్రి పేరు పీవీ చలపతిరావు. 1980లో జనతా నుంచి విడిపోయి సొంతపార్టీగా ఏర్పడిన సందర్భంలో ఏపీ బీజేపీకి తొలి అధ్యక్షుడిగా పీవీ చలపతి పనిచేశారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత.. ఆయన కొడుకు పీవీఎన్ మాధవ్ ఏపీ బీజేపీ సారధిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సబంధించి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.
కొత్త రాజధానిలో కొత్త రాజకీయం
రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిలో రాజధాని ఏర్పాటుతో ఏపీ రాజకీయాలు చాలావరకు విజయవాడ కేంద్రంగా సాగాయి. అధికారంలో ఎవరున్నా.. ప్రత్యర్థుల పట్ల దూకుడు, దాడులకూ తెగబడే వైనం బెజవాడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో అతి సాధారణంగా కనిపిచే దృశ్యాలు. ఇప్పుడు రాష్ట్ర రాజధానిని విజయవాడ శివారు నుంచి విశాఖపట్నానికి తరలిపోనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా(ఏప్రిల్3 లోగా) మూడు రాజధానులు, శాసన మండలి రద్దుకు ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి.
తద్వారా, పార్టీలు
తద్వారా, పార్టీలు అవే అయినప్పటికీ.. కొత్త రాజధాని కేంద్రంగా రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలు చోటుచేసుకోబోతున్నాయి. ఆ మార్పులో తాము ముందుండేందుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఓ సంచలన ఎత్తుగడ వేసింది.. కొత్త రాజధాని విశాఖలో సీఎం జగన్ కు స్పాట్ పెడుతూ.. అదే సిటీకి చెందిన పీవీఎన్ మాధవ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమిచనుంది. ఇన్నాళ్లూ కన్నా లక్ష్మీనారాయణ లాంటి వలస నేత నాయకత్వంలో పనిచేసిన ఏపీ కమలదళానికి.. ఇకపై నిఖార్సైన కాషాయవాది.. ఆర్ఎస్ఎస్ లోనే పుట్టిపెరిగిన మాధవ్ సేనాధిపతిగా వ్యవహరించనున్నారు.
రెండు రాష్ట్రాలూ బీసీలకే..
రెండు నెలల కిందటే సంస్థాగత ఎన్నికలు నిర్వహించిన బీజేపీ హైకమాండ్.. వరుసగా ఒక్కో రాష్ట్రానికి కొత్త అధ్యక్షుణ్ని ప్రకటిస్తూ వస్తోంది. తెలంగాణలో ఎంపీ బండి సంజయ్ కి పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఏపీకి పార్టీ సారధిగా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సబంధించి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి. తెలంగాణలో బీసీ(మున్నూరు కాపు) వ్యక్తికి నాయకత్వ బాధ్యతలు ఇచ్చినట్లే.. ఏపీలోనూ బీసీ(పాత కాపు) వర్గానికి చెందిన మాధవ్ ను బీజేపీ హైకమాండ్ ఎంపిక చేయాలనుకోవడం గమనార్హం.
వైజాగ్ ఆయన అడ్డా..
పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతోన్న పీవీఎన్ మాధవ్ పూర్తిపేరు.. పోకల వంశీ నాగేంద్ర మాధవ్. వైజాగ్ లోనే పుట్టి పెరిగిన ఆయన.. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో పెరిగారు. ఏబీవీపీలో విద్యార్థి నేతగా, బీజేవైఎంలో యువనేతగా మంచి గుర్తింపు పొందారు. కెరీర్ మొత్తం విశాఖ కేంద్రంగానే రాజకీయాలు నెరిపిన మాధవ్.. 2017లో ఎమ్మెల్సీగా గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిపోతున్నవేళ.. అదే సిటీకి చెందిన మాధవ్ ను రాష్ట్ర చీఫ్ గా నియమించడం ద్వారా పార్టీ బలోపేతమవుతుందని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది.
Recommended Video
గట్టి పోటీని తట్టుకుని..
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం.. గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ప్రకాశం జిల్లా నుంచి కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, రాయలసీమ నుంచి సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు చివరిదాకా రేసులో ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కావడంతో వీర్రాజుకు అవకాశాలు తగ్గాయి. తొలినుంచీ మాధవ్ పేరు ప్రముఖంగానే వినిపిస్తూ వచ్చింది.