రన్నింగ్ ట్రైన్ నుంచి ఫోన్ బయటపడిందా?
భారతీయ రైల్వే ప్రతిరోజు లక్షల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. వారికి మెరుగైన సేవలందించేందుకు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంటారు. రైలు రన్నింగ్ లో ఉన్న సమయంలో కిటికీ పక్కన కూర్చున్నవారు చాలామంది తమ ఫోన్లను లేదంటే పర్సులను పోగొట్టుకుంటారు. అప్పుడు వెంటనే చైన్ లాగి రైలును ఆపుతారుకానీ అలా చేయకుండానే మనం పోగొట్టుకున్న వస్తువు మనదరికి రైల్వే శాఖ చేరుస్తోంది. అదెలాగంటే..
రన్నింగ్ లో ఉన్న రైలు నుంచి ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకున్నప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఏ ప్రాంతంలో మీ వస్తువు జారిపోయిందో ఆ ప్రాంతాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే చాలని రైల్వే పోలీసులు చెబుతున్నారు. వారికి ఫిర్యాదు చేస్తూ ఎక్కడ పోగొట్టుకున్నామనేది సరిగ్గా చెప్పగలిగితే చాలు.. ఆ వస్తువు దొరకడానికి అవకాశం ఉంటుంది.
పొరపాటున ఏదైనా వస్తువు రైలులో నుంచి కింద పడిపోయినప్పడు ట్రాక్ పక్కనే ఉన్న పోల్ పై పసుపు, నలుపు రంగుల్లో ఒక నెంబరు రాసివుంటుంది. దాన్ని నోట్ చేసుకోవడంతోపాటు ఏ రెండు స్టేషన్ల మధ్య పడిపోయిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రైల్వే పోలీస్ ఫోర్స్ హెల్ప్ లైన్ నెంబరు 182 లేదంటే రైల్వే హెల్ప్ లైన్ నెంబరు 139కి కాల్ చేసి మనం పోగొట్టుకున్న వస్తువు గురించి ఫిర్యాదు చేయాలి.

ఫిర్యాదు ఆధారంగా వస్తువు పడిపోయిన ప్రాంతానికి రైల్వే పోలీసులు చేరుకొని ఆ వస్తువు గురించి వెతుకుతారు. అప్పటికి ఎవరూ తీసుకెళ్లకుండా ఉంటే దాన్ని స్టేషన్ కు తెచ్చి పోగొట్టుకువారికి సమాచారం అందిస్తారు. తర్వాత మనం స్టేషన్ కు వెళ్లి ఆ వస్తువును తీసుకెళ్లొచ్చు. రైలులో చైన్ ను అత్యవసర సమయంలోనే లాగాలి.
మనతోపాటు ప్రయాణిస్తున్న వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు రైలు ఎక్కలేకపోతే ఆ సందర్భంలో చైన్ లాగి రైలును ఆపొచ్చు. అలాగే అగ్నిప్రమాదం జరిగినప్పుడు, మరేదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు చైన్ లాగొచ్చు. కారణం లేకుండా చైన్ లాగితే జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు.












Click it and Unblock the Notifications