ఏపీలో తొలగిన ఎన్నికల కోడ్.. ఆ అధికారులపై జగన్ సర్కారు చర్యలు తీసుకుంటుందా ?
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు అనేక మలుపులు తిరుగుతూ చివరికి వాయిదా పడింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో స్ధానిక ఎన్నికల వాయిదాను ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించగా... సీఎం జగన్ ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఎన్నికల వాయిదాను సమర్ధించడంతో ఎన్నికల దాడుల నేపథ్యంలో ప్రకటించిన అధికారుల బదిలీలను ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అన్నది ప్రశ్నార్దకంగా మారింది.
ఎన్నికల వాయిదా -బదిలీలు..
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరును కరోనా ప్రభావంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్.. మరోవైపు శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారని పేర్కొంటూ చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేశారు. మరికొందరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో నీలం సాహ్ని అమలు చేయాల్సి ఉంది. కానీ ఆమె ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అంతలోపే నిమ్మగడ్డ రమేష్ నిర్ణయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఎన్నికల వాయిదాను కోర్టు సమర్ధించడం జరిగిపోయాయి. అయితే అధికారుల బదిలీలపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.
అధికారుల బదిలీ ఉంటుందా ?
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆరువారాల వాయిదా పడటం, కోడ్ ఎత్తివేత నిర్ణయాలు కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ఎన్నికల ప్రధానాధికారి హోదాలో నిమ్మగడ్డ రమేష్ ప్రకటించిన అధికారుల బదిలీలను జగన్ సర్కారు పట్టించుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈసీ ఆదేశాలు పెండింగ్ లో ఉన్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయం తీసుకోనప్పుడు దాన్ని మళ్లీ ఈసీకి తిప్పిపంపాల్సి ఉంటుంది.
ఎన్నికల కోడ్ ఎత్తివేతే కారణం...
ఏపీలో స్ధానిక పోరు వాయిదా ఖరారు కావడంతో ఇవాళ్టి నుంచి కోడ్ ఎత్తివేస్తూ ఎన్నికల ప్రధానాధికారి హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇవి తక్షణం అమల్లోకి వచ్చేశాయి. దీంతో కోడ్ లేదనే కారణం చూపి గతంలో ఈసీ ప్రకటించిన బదిలీలు, సస్పెన్షన్లను ప్రభుత్వం పక్కనబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయా బదిలీలపై సీఎం జగన్ నేరుగా ప్రెస్ మీట్లోనే ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వాటిని ఆమోదించి చర్యలు తీసుకునేందుకు సీఎస్ నీలం సాహ్ని చర్యలు తీసుకోకపోవచ్చు.
ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే...
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన అధికారులపై తాము గతంలో ప్రకటించిన చర్యలను ప్రభుత్వం అమలుకు నిరాకరిస్తే తిరిగి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ అమలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అదే జరిగితే ఎప్పుడో ఆరువారాల క్రితం జరిగిన తప్పులకు అధికారులను ఇప్పుడు ఎలా బాద్యులను చేస్తారంటూ మళ్లీ ప్రభుత్వం ఈసీతో వాదనకు దిగే అవకాశముంటుంది. దీంతో మరోసారి రాజ్యాంగ వ్యవస్ధల మధ్య ప్రతిష్టంభన తప్పదు. అలా కాకూడదని భావిస్తే ప్రభుత్వం ఇప్పుడే సదరు అధికారులను బదిలీ చేసుకునే అవకాశం ఉంది.