పవన్ వ్యాఖ్యలు లైట్, ఏపీపై మోడీ-షా కుట్ర, కేసీఆర్ భాగస్వామ్యం: నాని సంచలనం
అమరావతి: రాజధాని అమరావతి భూముల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆదివారం అన్నారు.
ఆంధ్రప్రదేశ్, సీఎం చంద్రబాబు నాయుడులను టార్గెట్గా చేసుకొని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రైల్వే జోన్ పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటనకు కేంద్ర అఫిడవిట్ విరుద్ధంగా ఉందన్నారు.
ఏపీని, చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని బీజేపీ నేతలు పన్నిన కుట్రలో గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ భాగస్వాములేనని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం విషయంలో కేంద్రం చేస్తున్న మోసం రైల్వే జోన్ విషయంలో అఫిడవిట్ ద్వారా మరోసారి బయటపడిందన్నారు.

నాగపూర్ జనాభా కంటే విజయవాడ జనాభా ఎక్కువ అని, అక్కడ మెట్రో మంజూరుకు లేని ఇబ్బంది విజయవాడకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అఫిడవిట్ అంశంపై పార్లమెంటులో పోరాడుతామన్నారు.
పవన్కు అసలు రైతులు అంటే తెలుసా అని నిలదీశారు. రైతులకు న్యాయం చేస్తున్న చంద్రబాబుపై పోరాటం మాని, రాష్ట్ర హక్కుల సాధన కోసం మోడీపై ఫైట్ చేయాలన్నారు. నాలుగు రోజులు రోడ్ల మీద తిరిగి 40 రోజులు హైదరాబాద్లో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. పవన్ సీరియస్ పొలిటీషియన్ కాదన్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications