వేదికపై 8 గంటలు మోడీ-బాబు, అరగంట మంతనాలు
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీలు తొమ్మిదేళ్ల తర్వాత భేటీ కావడమే కాకుండా ఒకే వేదికను ఎనిమిద గంటల పాటు పంచుకున్నారు. ఢిల్లీలోని త్యాగరాజ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన యువ సమ్మేళనంలో వీరు పాల్గొన్నారు. ఎనిమిది గంటల పాటు ఒకే వేదిక పైన కూర్చున్నారు.
వారిద్దర్నీ మందిరా బేడీ వేదిక పైకి ఆహ్వానించారు. చంద్రబాబు తొలి ప్రసంగం చేశారు. మోడీ చివరలో మాట్లాడారు. సమావేశానికి ముందు, తర్వాత బయల్దేరే ముందు ఇద్దరు రెండుసార్లు దాదాపు అరగంట పాటు మంతనాలు జరిపారు. వారి మధ్య ఎపి, గుజరాత్ అంశాలతో పాటు దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రాబోతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు, తర్వాత లోకసభ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తోంది.
మోడీ ఉత్తేజపూరిత ప్రసంగం
ఈ వేదికపై మోడీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పైన నిప్పులు చెరిగారు. యూపిఏ సర్కారు ప్రజల నాడి పట్టుకోలేకపోతోందని లేకుంటే నేర ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్స్ను తెచ్చే తప్పు చేసేది కాదన్నారు. నేర ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్స్పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి వైఖరితో అమెరికాలో ప్రధానికి మాట్లాడే వీలులేకుండా పోయిందన్నారు. అమెరికా నుంచి వస్తూ ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలతో తాను విస్మయం చెందానని, అవి 1980ల నాటి మాటలన్నారు. ఇది 21వ శతాబ్దమన్నారు.
ఈ రోజు ప్రజలకు కావాల్సింది అభివృద్ధేనని చెప్పారు. వారు తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలనుకుంటున్నారని మోడీ అన్నారు. కొందరి దృష్టిలో సెక్యులరిజం అంటే ప్రజల కళ్లల్లో దుమ్ముకొట్టడమేనని మోడీ దుయ్యబట్టారు. తన దృష్టిలో సెక్యులరిజం అంటే దేశమే ముందని నిర్వచించారు. ఈ దేశం రాజకీయ ప్రక్షాళనను, స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని కోరుకుంటోందన్నారు. తనను తాను హిందూత్వవాదిగా ప్రకటించుకుంటూనే దేవాలయాల కన్నా ముందు దేశంలో శౌచాలయాలు (మరుగుదొడ్లు) నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
తమ కుటుంబంలో ఎవరికీ పాలిటిక్స్ అనే పదంలో 'పి' అనే అక్షరం కూడా తెలియదని, తాను రైళ్లలో టీలు అమ్ముకునేవాడినని, ఈ రోజు మీ ముందు ఇలా నిలబడ్డానని కాబట్టి మీరెక్కడి నుంచి వచ్చారన్నది ఆలోచించవద్దన్నారు. మీరు దేశాన్ని మార్చాలనుకుంటే ముందుకు నడవాలని యువతకు సందేశమిచ్చారు. దారి మీకే కనబడుతుందన్నారు. పుచ్చుకునే దృక్పథంతో కాకుండా ఇచ్చే మనస్తత్వంతో మీరు ముందుకు కదిలితే ఈ ప్రపంచమే మీ పాదాల ముందుంటుందన్నారు.
అంతకుముందు మోడీ, బాబులు ఆడిటోరియంలోకి ప్రవేశించిన వెంటనే సభలో హర్షధ్వానాలు మారుమోగాయి. మోడీ, చంద్రబాబు తమ ప్రసంగాల్లో ఒకరపేరును మరొకరు ప్రస్తావించినప్పుడు కరతాళ ధ్వనులు హోరెత్తాయి. అయితే సభలో ప్రత్యేకాకర్షణగా నిలిచింది మాత్రం మోడీయే. విద్యార్థులంతా మోడీ.. మోడీ.. అంటూ నినాదాలు చేశారు.