ప్రధాని మోడీ...ఆయన మాటలు,కులం,చదువు...అంతా నకిలీనే:రఘువీరారెడ్డి
రాజమండ్రి: ప్రధాని మోడీ...ఆయన మాటలు...బీజేపీ ప్రభుత్వమూ అంతా నకిలీనే. అలాగే ఆయన కులం, చదువు కూడా అన్నీ నకిలీనే...అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. రాజమండ్రిలో నిర్వహించిన రణశంఖారావం పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీపై ఆరోపణల వర్షం కురిపించారు.మోడీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ నకిలీ, బీఏనో, ఎంఏనో చదివినట్లు బైటకు చెబుతూ ఉంటారు. కానీ ఎన్నికల అఫిడవిట్లో వివరించేవి వేరు...అంతేకాదు అసలు ఆయన ఫలానాచోట చదివినట్టు చెప్పే ఒక్క క్లాస్మేట్ కూడా లేడు. ఇంతవరకు ప్రధాని మోదీ క్లాస్మేట్నని ఒక్కరైనా చెప్పారా అని రఘువీరా ప్రశ్నించారు.
ఆయనకు వ్యతిరేకంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు తాను బీసీననే కారణంతోనే అవిశ్వాసం పెట్టారని మోదీ ప్రకటించారని, ఆయన చేసిన పనులపై చర్చకు మాత్రం రాలేదని, అసలు అక్కడ కుల ప్రస్తావన దేనికని రఘువీరా విరుచుకుపడ్డారు. ఇక బిజెపి కూడా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటించినప్పుడు ఆయన దార్శనికుడని, దేశోద్ధారకుడని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. మోడీ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి 3 నెలల పాటు గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేస్తే కాంగ్రెస్ కంటే 7 సీట్లు ఎక్కువ వచ్చాయన్నారు...ఇదేనా మోడల్...వాస్తంగా చూస్తే అది మోదీకి నైతిక ఓటమి అని రఘువీరా విశ్లేషించారు.
అలాగే భేటీ బచావో, భేటీ పఢావో నినాదం ఇచ్చే ప్రధాని తన భార్యను మాత్రం తన దగ్గరే ఉంచుకోరన్నారు. ఇలాంటి వ్యక్తి దేశానికి ప్రధాని కావడం ప్రజలు చేసుకున్న దురదృష్టమని రఘువీరా ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల తన పదవీ కాలంలో పార్లమెంటరీ వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థలను మోదీ ధ్వంసం చేశారు. ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కారు. పార్లమెంట్ను, రిజర్వుబ్యాంక్ను నిర్వీర్యం చేశారు. నోట్లరద్దుతో నిస్సహాయ స్థితిలో పడి బ్యాంకింగ్ వ్యవస్థ నాశనమైందని రఘువీరా విమర్శించారు. సీబీఐ, సుప్రీంకోర్టు వంటి వ్యవస్థలకు కూడా మోడీ ప్రభుత్వం చెడ్డపేరు తెస్తోందని రఘువీరా ఆరోపించారు.
బిజెపిలో ప్రస్తుతం మోడీ వంటరివాడని...భారతీయ జనతా పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా ముక్త్ మోదీ(మోదీ లేని బీజేపీ)ని చూడాలనుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. ఇంతవరకు ముక్త్ కాంగ్రెస్ అని నినదించిన మోడీ నోరు ఇక పెగలదన్నారు. బీజేడీ, శివసేన, అకాలీదళ్ వంటి మిత్రులు ఆయనకు దూరమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ కు కొత్త మిత్రులు దగ్గరవుతున్నారు. ఇక మోదీ పాలనకు ముగింపు పలకాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలపై ఉందని మోడీపై రఘువీరా విరుచుకుపడ్డారు.