'MODI' అంటే నాయుడు కొత్త అర్థం: వెంకయ్యని మెచ్చుకున్న ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు ఆదివారం నాడు పరస్పరం ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. బదల్పూర్ - ఫరీదాబాద్ మెట్రో మార్గం ప్రారంభోత్సవం సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... 'మోడీ' (MODI)కి కొత్త అర్థం చెప్పారు.
మోడీ అంటే.. మేకర్ ఆఫ్ డివలప్డ్ ఇండియా అంటూ అభివర్ణించారు. ఫరీదాబాద్కు స్మార్ట్ సిటీ నగరాల్లో చోటు కల్పించామని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.
అలాగే వెంకయ్య పైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. పట్టణ ప్రాంతాల్లో సామాన్యులకు ప్రయోజనం కల్పించేందుకు ఆయన పలు ప్రధాన చర్యలు చేపడుతున్నారన్నారు. వెంకయ్య నాయకత్వంలో పలు మెట్రో ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు.
ఇవి పట్టణ ప్రాంత ప్రయాణీకులకు ప్రయోజనం కల్పించడమే కాకుండా పర్యావరణ మార్పుల పైన ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తాయన్నారు. వెంకయ్య మార్గదర్శకత్వంలో ఆకర్షణీయ నగరాల (స్మార్ట్ సిటీలు) పథకానికి రూపునిచ్చి ప్రారంభించినట్లు చెప్పారు.
ఆకర్షణీయ నగరాలతో ఆర్థిక పురోగతి విస్తృతమవుతుందన్నారు. అందరికీ గృహ వసతి కల్పించాల్సిన అవసరం గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ... పట్టణ పేదల కోసం 2 కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి వెంకయ్య నేతృత్వంలోని గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకాన్ని ప్రస్తావించారు.
వెంకయ్య కృషి విజయవంతం కావాలని మోడీ ఆకాంక్షించారు. పట్టణాభివృద్ధి రంగంలో చేపట్టిన కొత్త పథకాల గురించి మోడీ ప్రస్తావించడం గమనార్హం. పట్టణాభివృద్ధి రంగంపై కేంద్రం దృష్టి, అందులో వెంకయ్య పాత్రను ప్రధాని గుర్తించారని భావించవచ్చు.