మోడీ వేవ్: టీలో ఓటర్ల డైలమా, కెసిఆర్ వ్యూహం
హైదరాబాద్: తెలంగాణలో కూడా బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గాలి వీస్తున్నట్లు కనిపిస్తోంది. మోడీ బుధవారం నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసి ఊపు తెచ్చారు. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, హైదరాబాద్ల్లో జరిగిన మోడీ బహిరంగ సభలకు విశేష ప్రతిస్పందన లభించింది. నిజామాబాద్, హైదరాబాద్ సభల్లో జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పాల్గొనడంతో ఆ సభలకు మరింత ఆకర్షణ చేకూరింది.
మహబూబ్నగర్లో మోడీ సభకు లభించిన ప్రజాస్పందన చూసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా సంతోషించినట్లు కనిపించారు. ఆయన తెలంగాణలో పూర్తిగా మోడీ గాలి మీదనే ఆధారపడి ఉన్నారు. తెలంగాణలోని ఓటర్లు మోడీని ప్రధానిగా కోరుకుంటున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును వదిలేయడానికి సిద్ధంగా లేరు. ఈ డైలమాలో తెలంగాణ ఓటర్లు కొట్టుమిట్టాడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఓటర్ల డైలమాను గమనించే కెసిఆర్ గత కొద్ది రోజులుగా కొత్త నినాదం అందుకున్నారు. లోకసభలో మనకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటేనే రాష్ట్రానికి ఏమైనా చేసుకోగలమని, అందువల్ల శాసనసభ అభ్యర్థులనే కాకుండా ప్రజలు లోకసభ అభ్యర్థులను కూగా గెలిపించాలని పదే పదే తన ప్రచార సభల్లో చెబుతూ వస్తున్నారు.
అయితే, తెలంగాణలో మోడీ గాలి వీస్తున్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెసు, తెరాస మధ్యనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ వ్యతిరేకిగా పేరు పడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణలో మద్దతు అంతంత మాత్రంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, తెలంగాణలో తమ క్యాడర్, మోడీ వేవ్ తమను గట్టెక్కిస్తుందని చంద్రబాబు నమ్ముతున్నట్లున్నారు.
బిజెపితో పొత్తు కారణంగా తెలుగుదేశం పార్టీ 12 శాతం ఉన్న మైనారిటీల ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. మైనారిటీల ఓట్లను తెరాస, కాంగ్రెసు పంచుకునే అవకాశం ఉంది. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డికి, తెరాస అభ్యర్థి రాజేశ్వర రెడ్డికి మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే, మహబూబ్నగర్లో మాత్రం బిజెపి అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థి జైపాల్ రెడ్డికి, తెరాస అభ్యర్థి జితేందర్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్నారు.