ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు రెండు కళ్లు: తిరుమలలో మోహన్ బాబు
చిత్తూరు: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తమకు రెండు కళ్లలాంటివి అని, తెలుగు ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు శనివారం ఉదయం అన్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నవ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని చెప్పారు. తెలుగు ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని దేవుడిని ప్రార్థించానని చెప్పారు. ఆయన కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీప్రసన్న, మనమరాళ్లతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.

మన్మథ నామ సంవత్సరంలోకి ప్రవేశించడంతో రెండు రాష్ట్రాల ప్రజలు శ్రీవేంకటేశ్వర స్వామి, షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో సకలసంపదలతో జీవించాలని కోరుకున్నానన్నారు. తన రెండో కుమారుడు మనోజ్ వివాహం మే 20వ తేదీన జరగనుందన్నారు. దాంతో వివాహ తొలి ఆహ్వాన పత్రికను స్వామివారికి సమర్పించానన్నారు.
కాగా, గత నెల 27వ తేదీన మోహన్ బాబు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. తన కుమారుడు, సినీ హీరో మనోజ్ నిశ్చితార్థానికి మోహన్బాబు కేసీఆర్ను ఆహ్వానించారు. మనోజ్ ప్రణితను వివాహం చేసుకోనున్నారు.












Click it and Unblock the Notifications