హ్యాపీగా ఉంది: మోహన్బాబు, నిజమే: ఎపిపై అద్వానీ
హైదరాబాద్/గుంటూరు/విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. నటుడు, నిర్మాత మోహన్ బాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం చురుగ్గా జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
అన్నగారు ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి తిరిగి అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా నేడు సీమాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
చంద్రబాబు తన విజనరీతో ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నానని చెప్పారు. ఆ షిరిడీ సాయినాథుడి ఆశీస్సులతో చంద్రబాబు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
అన్యాయం నిజమే: అద్వానీ
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది వాస్తవమేనని బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ చెప్పారు. బాబు హయాంలో ఎపికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఆయన పరిపాలనాధ్యక్షుడని, రాజకీయ అనుభవం కలిగిన నేత అన్నారు. బిల్లు సమయంలో ఎపికి అన్యాయం జరిగిందని చెప్పారు.