ఏపీలో ఫలిస్తున్న వాలంటీర్ల సర్వే.. బయటికొస్తున్న విదేశీ కరోనా కేసులు.. దాచిన వారిపై పలుచోట్ల కేసులు
ఏపీలో కరోనా వైరస్ ప్రబలడానికి ప్రధాన కారణంగా ఉన్న పలువురు విదేశీ ప్రయాణికులను ఇప్పటికే క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు మిగతా వారిని కూడా గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టింది. ఇందులో కరోనా లక్షణాలను దాచిపెట్టి నేరుగా ఇళ్లకు చేరుకున్న పలువురిని వాలంటీర్లు, ఆశావర్కర్లు గుర్తించారు. దీంతో వారి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

ఫలిస్తున్న ఇంటింటి సర్వే..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలు కాగానే ప్రభుత్వం విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారిని గుర్తించి క్వారంటైన్ కు పంపడం ప్రారంభించింది. అయితే కొందరు ఇతర రాష్ట్రాల్లోని విమానాశ్రయాలకు, పోర్టులకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి వచ్చేశారు. వీరితో పాటు క్వారంటైన్ లో ఉంచిన కొందరు తప్పించుకుని ఇళ్లకు చేరుకున్నారు. వీరిని గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపడుతోంది. గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్ల సాయంతో చేపట్టిన ఈ సర్వేలు పలు షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ సర్వేను రెండో విడత కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

క్వారంటైన్ల నుంచి తప్పించుకున్న ఘనులు..
ఏపీకి విదశాల నుంచి చేరుకున్న పలువురిని నేరుగా ఆస్పత్రులకు తరలించి కరోనా ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో క్వారంటైన్ అందిస్తున్నారు. అయితే వీరిలో కొందరు ఈ మద్యే తప్పించుకుని పారిపోయారు. గుంటూరు జీజీహెచ్ కరోనా క్వారంటైనా నుంచి పరారైన ఓ యువకుడిని తాజాగా గుర్తించారు. అతను కేసు షీట్ కూడా తీసుకుని పరారైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆందోళనలో ఉన్న వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు కొనసాగిస్తున్నారు. అలాగే మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రి లో నర్స్ గా పనిచేస్తున్న ఓ మహిళ భర్త ఇటీవల కువైట్ నుంచి వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నిర్బంధం నుంచి తప్పించుకుని బందరుకు చేరుకున్నాడు. స్ధానికంగా జనావాసాల్లో తిరుగుతున్నట్లు సర్వేలో గుర్తించిన వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నర్సుపై పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.
భర్త తప్పించుకున్న వివరాలు దాచిపెట్టిన నర్సుపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు ఇంటివద్ద పికెట్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు సదరు నర్స్ పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు పిర్యాదు కూడా చేశారు.

కరోనా ఉందని తెలిసి కూడా జనంలోకి..
తాజాగా అమెరికా నుంచి వచ్చి విజయవాడలో హోం క్వారంటైన తీసుకుంటున్న ఓ యువకుడు చేతికి ట్యాగ్ వేసి ఉన్నా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడు. ఈ నెల 16న అమెరికా నుంచి వచ్చిన ఈ యువకుడికి అధికారులు హోం క్వారంటైన్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు జిల్లాలోని మచిలీపట్నం, పెదపారుపూడి మండలం భూషణగుల్లలోని తన బంధువుల ఇళ్లకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతను ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరిని కలిశాడనే వివరాలను వాలంటీర్ల ద్వారా ఆరా తీస్తున్నారు.

ఉల్లంఘనుల వివరాలు తెలిస్తే కానీ..
విదేశాల నుంచి ఏపీకి చేరుకున్న వారంతా హోం క్వారంటైన్ లోనో, ఆస్పత్రుల్లోనో ఉండాల్సి ఉంది. కానీ ఇప్పుడు వారిలో చాలా మంది వివిధ కారణాలతో ప్రజల్లో కలిసిపోవడంతో పాటు తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో ప్రభుత్వం రోజువారీ ప్రకటిస్తున్న వివరాల్లోనూ సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన వాలంటీర్లు ఇంటింటి సర్వే ద్వారా ఇలాంటి వారి వివరాలను సేకరిస్తున్నారు. వీరి వివరాలు పూర్తిగా తెలిస్తే కానీ ఏపీలో కరోనా వైరస్ వాస్తవ పరిస్దితి గుర్తించలేమని అధికారులు చెబుతున్నారు. విదేశీయుల రాకపై పూర్తి వివరాలు లభిస్తే తప్ప ఏపీలో కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేని పరిస్ధితి ఇప్పుడు అధికారులకు తలెత్తుతోంది.












Click it and Unblock the Notifications