కర్నూలు జిల్లా గ్రామాల్లో భయం..భయం: కోతుల మృతి: మరి కొన్ని చావు బతుకుల్లో: పోస్టుమార్టమ్లో..!
కర్నూలు: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోన్న జిల్లా ఏదైనా ఉందంటే అది కర్నూలే. గుంటూరు జిల్లాలోనూ భారీ ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ.. కర్నూలుతో పోటీ పడలేకపోతోంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 158 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. గంటగంటకూ కొత్త కేసులు వెలుగు చూస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా పెద్ద సంఖ్యలో కోతులు మరణిస్తుండటం కలకలం రేపుతోంది.
కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని గడివేములలో సుమారు 20కి పైగా కోతులు మరణించాయి. మరి కొన్ని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. లేవలేని స్థితికి చేరుకున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో పెద్ద సంఖ్యలో కోతులు మృత్యువాత పడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కోతులు కరోనా వైరస్ వల్ల మరణిస్తున్నాయనే వదంతులు వ్యాపించాయి. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా ఉన్నతాధికారులు, నందికొట్కూరు పశు వైద్యాధికారులు గడివేములకు చేరుకున్నారు.
కోతుల కళేబరాలకు పోస్టుమార్టమ్ నిర్వహించారు. కరోనా వైరస్ వల్ల కోతులు మరణించలేదని, ఆకలికి తట్టుకోలేక చనిపోయినట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి ఆహారం దొరకట్లేదని అన్నారు. లాక్డౌన్ వల్ల ప్రజలు బయటికి రాకపోవడం, దుకాణాలు తెరవకపోవడం వంటి కారణాల వల్ల కోతులకు ఆహారం దొరకట్లేదని అన్నారు. జంతు ప్రేమికులు వాటికి ఆహారాన్ని అందించాలని విజ్ఙప్తి చేశారు.
కరోనా వైరస్ వల్ల కోతులు మరణించినట్లు నిర్ధారణ కాకపోవడం వల్ల గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో పెద్ద సంఖ్యలో అవి ఆహారం దొరక్కపోవడం వల్ల మరణించడం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రంగా ఉన్నందున కోతులు ఆకలిదప్పులకు గురి అవుతున్నాయని, వాటిని కాపాడటానికి తక్షణ చర్యలను తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదివరకు కర్నూలు జిల్లాలోనే కాకులు మరణించిన ఉదంతం కూడా చోటు చేసుకుంది.