వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆరేళ్ళ కొడుకుకు చిత్రహింసలు
తూర్పుగోదావరి:అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా అని ఓ సినీ కవి ఓ పాట రాశాడు. అయితే అమ్మ అనే మాటకు మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది ఓ తల్లి. వివాహేతర సంబంధానికి తన ఆరేళ్ళ కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి నిత్యం చిత్రహింసలు పెడుతోంది.స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.
తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలకేంద్రంలోని మార్కండేయపురం ప్రాంతానికి చెందిన మల్లిడి దుర్గాదేవి కుటుంబ కలహలతో ఆరేళ్ళుగా భర్తకు దూరంగా ఉంటోంది.
ఆమెకు ఆరేళ్ళ కుమారుడు మణి సతీష్ రెడ్డి ఉన్నాడు. అయితే భర్తకు దూరంగా ఉంటోన్న ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.
వివాహేతర సంబంధానికి ఆరేళ్ళ కొడుకు అడ్డుగా ఉంటున్నాడని భావించి ప్రతి నిత్యం చిత్రహింసలకు గురిచేసేదని స్థానికులు చెబుతున్నారు.
దీంతో స్థానికులు ఆనపర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు.స్పందించిన ఎస్ ఐ ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. రాయవరం మండలం లోల్ల గ్రామంలోని బాలల సదనానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.