చంద్రబాబు ఇలాకాలో మదర్ డెయిరీ భారీ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ (Mother Dairy) భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. మదర్ డెయిరీ సఫల్ పేరిట ఇప్పటికే పలు చోట్ల తాజా పండ్లు, కూరగాయల రిటైలింగ్లో ఉన్న ఈ సంస్థ చిత్తూరు జిల్లా కుప్పంలో రూ. 150 నుంచి 200 కోట్ల వరకు పెట్టుబడులతో ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా మదర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ బాండ్లిష్ మాట్లాడుతూ.. రూ. 600 కోట్లతో గుజరాత్, ఏపీలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గుజరాత్లోని బరోడా సమీపంలోని ఇటోలాలో రూ. 400 కోట్ల వ్యయంతో ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది రెండేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఇప్పటికే బోర్డు ఆమోదం తెలిపిందన్నారు.

ఇటోలాలోని ప్లాంటు రెండేళ్లలో పూర్తవుతుందన్నారు. ఇక, ఏపీలో కుప్పంలో ఏర్పాటుకు సంబంధించి తమకు భూ కేటాయింపు జరగ్గానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. దీనిపై ఇంకా డీపీఆర్ తయారు కాలేదన్నారు. ప్రస్తుతం మదర్ డెయిరీ సఫల్ బ్రాండ్కు మూడు చోట్ల బెంగళూరు, రాంచీ, ఢిల్లీలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ మూడు ప్లాంట్లలో ఏడాదికి రెండు లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేస్తున్నారని వెల్లడించారు.
పాలు, పాల ఉత్పత్తులను ప్రాసెస్ చేసేందుకు రూ. 500 కోట్లకుపైగా పెట్టుబడులతో న్యూ నాగ్పూర్లో ప్లాంటు నిర్మాణం జరుగుతోందన్నారు. 2026 నాటికి అక్కడి కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మనీష్ తెలిపారు. ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లో ఇటీవల ఆవిష్కరించిన ఇడ్లీ-దోశ పిండికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించిందని తెలిపారు. రోజుకు టన్ను చొప్పున తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications