గుప్తనిధుల కోసం ఇంట్లో గొయ్యి: శ్రీకాకుళంలో విస్తుపోయిన స్థానికులు
అమరావతి: శ్రీకాకుళం జిల్లాలోని బలగలో ఓ తల్లీకూతుళ్ల నిర్వాకాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. కాళీమాత కలలో కనిపించిందంటూ ఇంట్లో సుమారు 20 అడుగుల గోయ్యి తీసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళంలోని మడ్డి వీధిలోని ఓ ఇంట్లో తల్లీ కూతుళ్లు ఇద్దరూ కలిసి సుమారు 20 అడుగుల గొయ్యి తీసి అందులోనే నివాసం ఉంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని స్థానికులు ప్రయత్నించినా వారిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చారు.
గుప్తనిధుల కోసమే వారు ఇంట్లో తవ్వకాలు జరిపారని స్థానికులు చెబుతున్నారు. అయితే వీరి కదలికలపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి వద్దకు చేరుకోగానే కాసేపు హైడ్రామా నడిచింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ కలిసి పోలీసులను ఇంటిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఇంట్లో ప్రేతాత్మలున్నాయని మీరు లోపలికి వెళ్లకూడుదంటూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే చివరకు ఎట్టకేలకు ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఇంట్లో ఉన్న గొయ్యిని చూసి ఆశ్చర్యపోయారు. ఇంటి కింది భాగంలో సుమారు 20 అడుగుల మేర తీసిన పెద్ద గొయ్యిని పోలీసులు గుర్తించారు.
అయితే వారి మానసిక స్థితి బాగాలేనందువల్లే ఇంటిలో గొయ్యి తీశారని, అంతేకాకుండా ఇంట్లో ప్రేతాత్మలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. తల్లీ కూతుళ్లని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారు మాత్రం కలలో కాళీమాత దర్శనమివ్వడం వల్లే తాము తవ్వకాలు జరిపామని చెబుతున్నారు.
త్వరలో ఇదే గొయ్యిలో కాళీమాతకు గుడి కూడా కడతామని అంటున్నారు. గొయ్యి తవ్వే క్రమంలో తన కుమార్తే ఒళ్లంతా బరువై పోయి అదొక ఇదిలో ఉండి ఆవిరిలో మంటలు వచ్చేశాయని కూడా తల్లి చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.