కొత్త మలుపు తిరిగిన బెజవాడ పరువు హత్య, ప్రియుడిపై కేసు
విజయవాడ: బెజవాడ పరువు హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రియుడు దీపక్ పైన పోలీసులు శుక్రవారం నాడు కేసు నమోదు చేశారు. అతని పైన కిడ్నాప్, బెదిరింపులు, మైనర్ పైన అత్యాచారం కేసులు నమోదు చేశారు.
యువతి తల్లి ఆరోపణల నేపథ్యంలో పోలీసుల విచారణలో దీపక్ బాగోతం బయటపడినట్లుగా తెలుస్తోంది. సర్టిఫికెట్ల ఆధారంగా బాధితురాలిని పోలీసులు మైనర్గా నిర్ధారించారు. అనంతరం అతని పైన పోలీసులు ఎఫ్ఐఅర్ నమోదు చేసుకున్నారు.
బెజవాడలో పరువు హత్య: 'నా కూతురు తప్పు చేసింది అందుకే చంపేశా'
కాగా, విజయవాడలోని వాంబే కాలనీలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కన్నతల్లే కడుపు చించుకుని పుట్టిన కూతురిని హతమార్చింది. వేరే మతస్థుడిని ప్రేమించిందన్న సాకుతో కన్న కూతురిని ఓ మహిళ హత్య చేసింది.
విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. అయితే ఈ విషయంలో భార్య చేసిన నేరానికి ఆమెను తప్పుబట్టాల్సిన భర్త అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన బీబీజాన్కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు నజ్మా ఓ యువకుడితో ప్రేమలో పడిందని తల్లికి అనుమానం వచ్చింది. దీంతో కుటుంబాన్ని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు మార్చింది.
అయినా కూతురు వ్యవహారంలో మార్పు రాలేదు. మళ్లీ మూడు నెలల కిందట విజయవాడలోని వాంబే కాలనీకి వచ్చారు. అక్కడ కూడా కూతురు తన మాట వినకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆమె మంగళవారం రాత్రి నిద్ర పోతున్న కుమార్తె నజ్మా ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
బుధవారం ఉదయాన్నే విషయం బయటకు పొక్కకుముందే కడుపు నొప్పితో తన కూతురు చనిపోయిందని అందరినీ నమ్మించింది. అయితే నజ్మాను ప్రేమించిన దీపక్ యువకుడికి ఈ విషయం తెలియడంతో పోలీసులను సంప్రదించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీబీని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని వెల్లడించింది.
తాను వారించినా వినకుండా తన కూతురు వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని అందుకే హత్య చేశానని విచారణలో నిజాన్ని అంగీకరిచింది. తన కూతురు కంటే తమకు పరువే ముఖ్యమని ఆమె చెప్పడం విశేషం. కుటుంబం పరువు తీస్తున్న కారణంగానే తన కూతురిని హత్యచేశానని ఆమె చేసిన నేరాన్ని నిర్భయంగా ఒప్పుకుంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు.