పుట్టిన ఆడబిడ్డను చంపేసిన తల్లి: కోడలిపై అత్త ఆందోళన
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. తాను తొమ్మిది నెలలు మోసి కన్న పసికందును కన్నతల్లే హతమార్చింది. నిండు గర్భిణి ప్రసవానికి బుధవారం ఆస్పత్రిలో చేరింది. నొప్పులు మొదలు కాగానే టాయిలెట్ అంటూ ఆ మహిళ బాత్రూంకు వెళ్లింది.
అక్కడ ఆ మహిళ ఆడబిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయింది. టాయిలెట్ వద్ద రక్తపు మడుగులో శిశువు మృతదేహం పడి ఉండడంతో సిబ్బంది గుర్తించి ఆస్పత్రి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
మహిళ కోసం ఎంతగా గాలించినా ఫలితం కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టిందనే కోపంతోనే మహిళ శిశువును చంపేసి వెళ్లిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
కోడలిపై అత్త ఆందోళన
తనను కోడలు వేధిస్తుందని ఓ అత్త నిరసనగా తన కొడుకు నగల దుకాణం ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కదిరి పట్టణంలోని ఎంజీరోడ్డుకు చెందిన గోవిందమ్మ(45) తనను కోడలు వేధిస్తోందని, డబ్బు విషయమై వివాదం జరిగిందని తన కొడుకు భాస్కరాచారికి చెందిన నిహారిక జ్యూయెలరీస్ ఎదుట ఆందోళన చేపట్టింది.
కాలువలో జారిపడి చిన్నారుల మృతి
తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం కొండకాలువ దగ్గర కాలువలో జారిపడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులని పోలీసులు చెప్పారు. చిన్నారులను వెలికి తీయించారు.
నగల షాపులో చోరీ
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొసిపూడిలో భారీ చోరీ జరిగింది. ఓ నగల దుకాణంలో కిలోన్నర బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దొంగలు అపహరించుకువెళ్లారు. నగలతోపాటు మూడు లక్షల నగదును కూడా దొంగలు ఎత్తుకెళ్లారు.
గంజాయి స్వాధీనం
విశాఖపట్నం జిల్లా అరకులోయలో కారులో తరలిస్తున్న 65 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఎక్కడినుంచి ఎక్కడకు తరలిస్తున్నారనే అంశంపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.