కారడవిలో పసికందు: పేగుబంధం తెంచేసుకున్న తల్లి; ఏపీలో అమ్మ అమానుషం!!
మాతృత్వానికి నోచుకోక పిల్లల కోసం తపన పడుతున్న తల్లులు ఎందరో మన దేశంలో ఉన్నారు. ఇదే సమయంలో మాతృత్వాన్ని మరచిపోయి బిడ్డలను వదిలి వెళ్తున్న తల్లులు ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్నతల్లి అప్పుడే పుట్టిన పసికందును అనాధను చేసింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును అర్దరాత్రి కారడవిలో వదిలివెళ్లిన ఘటన అందరి మనసులను కలచివేసింది.
పేగుబంధం తెంచేసుకున్న తల్లి.. అనాధగా మారిన నవజాత శిశువు
అమ్మ ఒడిలో ఉండాల్సిన బిడ్డ, తల్లి పాలు తాగుతూ సేద తీరాల్సిన పసికందు తల్లి పేగు బంధం తెంచుకు వెళ్ళిపోవటంతో అడవిలో అనాధగా మిగిలిన ఘటన ఆవేదన కలిగించింది. అమ్మ లేక అనాధగా మారిన ఆ శిశువు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తూ కనిపించిన ఘటన ఆ పసికందును చూసిన వారి మనసులను కలచివేసింది. ఏ పాపమూ తెలియని, అన్యం పుణ్యం ఎరుగని ఆ శిశువును తల్లి అనాధను చేసి వెళ్ళిపోయిన ఘటన అందరికీ బాధను కలిగించింది.
అడవిలో బిడ్డను వదిలి వెళ్ళిన తల్లి అమానుష నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో శిశువును కన్నతల్లి ఏ కారణంతో తీవ్ర నిర్ణయం తీసుకుందో తెలీదు కానీ బిడ్డను వదిలి వెళ్ళింది. పేగు పాశం మరచిపోయి ప్రవర్తించింది. అమ్మ అన్న పదానికే మాయని మచ్చ తెచ్చింది. అనంతగిరి మండలంలోని వంటల మామిడి గ్రామ శివారులో ఈ ఘటన వెలుగు చూసింది. అర్ధరాత్రి సమయంలో కారడవిలో పురిటి నొప్పులతో ఓ బిడ్డను ప్రసవించిన తల్లి, ఆ బిడ్డను అక్కడే వదిలి వెళ్ళిపోయింది. రాత్రంతా చీకట్లో కారడవిలో ఆ పసికందు ఒంటరిగానే ఉంది. ఏవైనా జంతువులు బిడ్డ ప్రాణాలు తీస్తాయేమో అని కూడా ఆ తల్లి ఆలోచించలేకపోయింది. అత్యంత అమానుషమైన నిర్ణయం తీసుకుంది.
బిడ్డ ఏడుపు విన్న గ్రామస్తులు..108 కు సమాచారం; ఆస్పత్రికి తరలింపు
తెల్లవారుజామున గ్రామస్తులు పొలం పనులకు వెళుతుండగా పసికందు ఏడుపు వినిపించింది. గ్రామస్తులు అక్కడకు వెళ్లి చూసేసరికి తువ్వాలు లో చుట్టి అక్కడ వదిలి వెళ్లిన ఆడశిశువు కనిపించింది. తల్లి బిడ్డ ను వదిలి వెళ్ళింది అని గ్రహించిన గ్రామస్తులు, ఆ పసికందును చేతుల్లోకి తీసుకొని ఊరడించే ప్రయత్నం చేశారు. ఏ తల్లి కని వదిలి వెళ్ళిపోయిందో అని బాధ పడ్డారు. ఆపై 108కు సమాచారం అందించి 108 సిబ్బందికి గ్రామస్తులు పసికందును అప్పగించారు. వారు పసికందును ఆస్పత్రికి తరలించారు. ఇక సమీప గ్రామాలలో ఎవరైనా గర్భిణీ స్త్రీ ఈ పని చేసిందా అని స్థానిక ఆశా వర్కర్లు ఆరా తీస్తున్నారు.