అక్రమ సంబంధం అంటగట్టి పిల్లలను చంపేశాడు: కడుపుకోతతో గుక్క పట్టిన తల్లి
విశాఖపట్నం: తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా ప్రేమించివాడిని పెళ్లాడిన మహిళ ఇప్పుడు కడుపుకోతను అనుభవిస్తోంది. తన ఇద్దరు పిల్లలను భర్త చంపేయడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పిల్లలను వదిలేసి తనను చంపేసినా బాగుండునని గుక్క పట్టి ఏడుస్తోంది.
పెళ్లి చేసుకున్న తర్వాత రెండేళ్ల వరకూ బాగానే చూసుకున్న భర్త పిల్లలు పుట్టిన తరువాత వేధింపులు మొదలెట్టాడు. వివాహేతర సంబంధం అంటకట్టాడు. అతని వేధింపులను భరిస్తూ కన్నపిల్లల కోసం తల్లిదండ్రులు రమ్మని పిలిచినా అక్కడే ఉండిపోయింది.
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం నామవరంలో భర్త తన ఇద్దరు పిల్లలను చంపేసిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. బుధవారం ఉదయం నక్కపల్లి ఆస్పత్రి మార్చురీ వద్ద తన కన్నపిల్లలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటే ఆ తల్లి శోకంతో తల్లడిల్లిపోయింది.
తన పిల్లల కోసం ఎంత కష్టాన్నైనా మనసులోనే దాచుకున్నానని చెప్పింది. తనను వేధిస్తుంటే భరించాను గానీ పిల్లలు హని, కార్తీక్ను తన భర్తే పీక నులిమి చంపేస్తాడని కలలో కూడా అనుకోలేదని ఆమె విలపించింది.. కనీసం పిల్లలను వదిలేసి తనను చంపేసినా బాగుండునని, ఎంత పేదిరకంలో వున్న పిల్లలను చూసి మురిసిపోయేదానినని ఆమె ఆవేదన చెందింది.
పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలో కన్నబిడ్డలను దారుణంగా హత్యచేసిన కసాయి తండ్రిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు ఎలమంచిలి సీఐ కె.వెంకట్రావ్ బుధవారం చెప్పారు. నామవరం గ్రామానికి చెందిన పాలిక సత్తిబాబు తన భార్యతో మంగళవారం గొడవపడడంతో ఆమె ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయింది.
దీంతో మంగళవారం రాత్రి ఇద్దరు పిల్లలు హని, కార్తీక్లను దూరంగా తీసుకెళ్లి పీకనులిమి చంపేసి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనకు కారణమైన సత్తిబాబును అరెస్ట్ చేసినట్టు సీఐ చెప్పారు. నక్కపల్లి ఎస్ఐ ఎల్.రామకృష్ణ వున్నారు.
పాలిక అప్పలకొండ, వరహాలు దంపతులకు రెండో సంతానమైన పాలిక సత్తిబాబు ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఈక్రమంలో సీతారాంపురం సమీపంలో ఉన్న జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నామవరం గ్రామానికి చెందిన తెరపల్లి సూర్యకాంతం, దండియ్య రెండో సంతానం నిర్మల వెంటపడి ప్రేమిస్తున్నానని నమ్మించి గర్భవతిని చేయగా పెద్దల సమక్షంలో వీరిద్దరికీ వివాహం చేశారు.
సత్తిబాబును అతడి తల్లిదండ్రులు ఇంట్లోకి రానీయకపోవడంతో గాంధీనగరంలోని మామగారి ఇంటికి సమీపంలో చిన్న పూరిపాకలో సత్తిబాబు కాపురం పెట్టాడని తెలిపారు. రోజూ ట్రాక్టర్పై మట్టి మోస్తూ భార్యను పోషించేవాడు. పిల్లలు హనిప్రియ, కార్తీక్ పుట్టిన తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి.