గొంతు పిసికిన బాబుకు చుక్కలు చూపిస్తా, వారికి సాయం చేస్తా: మోత్కుపల్లి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత మూడు నెలలుగా తాను రాజకీయాల గురించి మాట్లాడటం లేదన్నారు. కేవలం తన లక్ష్యం ఏమిటో మాత్రమే చెబుతున్నానని తెలిపారు.
బాబూ! జాగ్రత్త, గవర్నరేం చేస్తున్నారు: సోము వీర్రాజు, 'వెంకయ్య వద్దకు వైసీపీ వాళ్లను రమ్మంటే'
ఒక దళితుడినైన తనను అమర్యాదకరంగా తెలుగుదేశం పార్టీ నుంచి గెంటి వేశారని ఆరోపించారు. దానికి సంబంధించిన ఫలితాన్ని చంద్రబాబు అనుభవించాలని చెబుతున్నానని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు ఓ మిత్రుడిగా సహకరిస్తానని తెలిపారు.
జగన్, పవన్ కళ్యాణ్, కిరణ్ రెడ్డిలను కలుస్తా
రాజకీయ నాయకులు అందరూ ఏకమై చంద్రబాబు వంటి చీడపురుగును ఏరిపారేయాలని తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు ఓ ఇంటర్వ్యూలో ధ్వజమెత్తారు. మూడున్నర దశాబ్దాల పాటు పార్టీ కోసం పని చేసిన తనను అవమానకరంగా, గొంతు పిసికి రోడ్డుపై పడేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఏ తప్పూ చేయని తన గొంతు కోసిన చంద్రబాబు దానికి తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. చంద్రబాబును ఓడించేందుకు ఏపీలో జగన్, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డిలను కలుస్తానని చెప్పారు.
ఎన్టీఆర్ శిష్యుడిని, మోచేతి నీళ్లు తాగను
తాను ఏ పార్టీలో చేరాలనే విషయం ఇంత వరకు నిర్ణయించుకోలేదని మోత్కుపల్లి తెలిపారు. తన గౌరవాన్ని కాపాడే పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. లేదంటే తనను అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఆలేరు నుంచి స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని తెలిపారు. తాను ఎన్టీఆర్ శిష్యుడినని, ఒకరి మోచేతి నీళ్లు తాగి బతికే వాడిని కాదన్నారు.
రాజ్యసభ, గవర్నర్ పదవులు ఇస్తానని పార్టీలో లేకుండా చేశారు
చంద్రబాబు ఇంటి ఎదుట పదిహేనేళ్ల పాటు కుక్కలా ఉన్నానని, తాను లేకుంటే ఆయన తిండి తినలేదని, నీళ్లు తాగలేదని, నిద్రపోలేదని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తనను బాగా వాడుకున్నాడని మండిపడ్డారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని, గవర్నర్ సీటు ఇస్తానని చెప్పారని, చివరకు పార్టీలో ఒక సభ్యుడిగా కూడా కొనసాగుకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు చుక్కలు చూపించాలి
మాల, మాదిగలు అంటే చిన్నచూపు ఉండే చంద్రబాబుకు చుక్కలు చూపించాలన్నదే తన అభిమతమని మోత్కుపల్లి చెప్పారు. పవన్ కళ్యాణ్కు ఒక మిత్రుడిగా సాయం చేయాలనుకుంటున్నానని తెలిపారు. జగన్కు కూడా ఒక మిత్రుడిగా తనకు తోచిన సాయం చేస్తానని చెప్పారు. తాను తిరుపతికి వెళ్లినప్పుడు జగన్, పవన్ కళ్యాణ్ల మనుషులు తన కోసం వచ్చారని తెలిపారు.