కెసిఆర్ రూపంలో నిజాం బతికే ఉన్నాడు: విరుచుకపడిన మోత్కుపల్లి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుపై నేతలు తీవ్రంగా విరుచుకపడ్డారు.కేసీఆర్ రూపంలో నిజాం బతికే ఉన్నారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. మాదిగలకు, మాలలకు, మహిళలకు, పేదప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకమని ఆరోపించారు. తెలంగాణ ద్రోహి ఎవరైనా ఉంటే అది కేసీఆరే అని వ్యాఖ్యానించారు.
నిజాంను మంచి అన్నవారు ఎవరూ లేరని, నిజాం ఆలోచనా విధానమే కేసీఆర్ నైజమన్నారు. తెలంగాణ పునర్నిర్మాణమంటూ కెసిఆర్ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది కేసీఆర్ కుటుంబ పునర్నిర్మాణమని ఆరోపించారు. దోచుకోవడం తప్ప సంక్షేమం అన్నమాట కేసీఆర్కు పట్టడం లేదన్నారు.

దళితులు, మహిళలకు కేబినెట్లో అవకాశం ఇస్తారో ఇవ్వరో టీఆర్ఎస్ పీన్లరీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించరా అని నిలదీశారు. అల్లుడు మిషన్కాకతీయ, కొడుకు వాటర్గ్రిడ్తో దోచుకుంటున్నారని మోత్కుపల్లి ఆరోపించారు.
టీఆర్ఎస్ వైట్కాలర్ పార్టీగా మారిందని మరోనేత రావుల చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ప్లీనరీ తీర్మానాల్లో యువత, రైతు ప్రస్తావనే లేదని మండిపడ్డారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిలిపివేస్తున్నట్లు తీర్మానం చేయాలన్నారు. ఇది ఎమ్మెల్యేల కొనుగోలు ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ప్లీనరీ సమావేశం కాదు, ఫిరాయింపుల సమూహమని మరోనేత రాములు అన్నారు. కేసీఆర్ రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు.












Click it and Unblock the Notifications