మానత్వం లేని మనిషి: కెసిఆర్పై మోత్కుపల్లి, కడియంకు సవాల్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను మానత్వం లేనోన్ని కాదని చెప్పారు. తమ రిజర్వేషన్లలో వేరే వాళ్లు వస్తే ఎట్లా అని ఆయన ప్రశ్నించారు.
చిత్తశుద్ధి ఉంటే కోర్టుకు వెళ్లి కుల ధృవీకరణపై స్పష్టత ఇవ్వాలని కడియం శ్రీహరికి మోత్కుపల్లికి సవాల్ విసిరారు. కడియం శ్రీహరి మాదిగ కాదని తమ దగ్గర ఆధారాలున్నాయని మోత్కుపల్లి చెప్పారు. ముప్పై ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న తనకు కడియం పట్ల నాకేందుకు ఈర్షా ఉంటుందని అన్నారు. దళిత వర్గానికి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.
బిసి అయి ఉండి మాదిగ అని చెప్పుకుంటున్నారని కడియంపై మోత్కుపల్లి మండిపడ్డారు. కడియం గురించి లోతుగా మాట్లాడితే బాగుండదని అన్నారు. కెసిఆర్ తన కాలి గోటికి కూడా సరిపోడని కడియం గతంలో అన్నారని ఈ సందర్భంగా మోత్కుపల్లి గుర్తు చేశారు. దళితులకు కావాల్సినవి వేరే కులానికి చెందిన వారు ఎత్తుకెళ్తున్నారనే తన బాధ అని అన్నారు.
దళిత వర్గానికి చెందిన రాజయ్యను మానత్వం లేకుండా భర్తరఫ్ చేశారని ముఖ్యమంత్రి కెసిఆర్పై మోత్కుపల్లి ధ్వజమెత్తారు. ఇది కెసిఆర్ దురంహకారానికి, దొరతనానికి, లెక్కలేని తనానికి నిదర్శనమని ఆరోపించారు. మానత్వం లేని మనిషి కెసిఆర్ అని దుయ్యబట్టారు. మాదిగలను అవమానపర్చిన కెసిఆర్.. వారందరికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.
రాజయ్య బర్తరఫ్ అన్యాయం: మందకృష్ణ
కేసీఆర్ ప్రభుత్వంపై దండయాత్రకు శనివారం కార్యాచరణ రూపొందిస్తామని మందకృష్ణ వెల్లడించారు. కేసీఆర్ మాల, మాదిగలను అవమానిస్తున్నారని, అగ్రకులాలకే మంత్రి పదవులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆరోపణలు వచ్చిన మంత్రులు హరీష్రావు, నాయినిని వదిలి రాజయ్యను బర్తరఫ్ చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. స్వైన్ఫ్లూ మరణాలు ఇంకా ఆగలేదని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.