TDP MP అభ్యర్థులు వారేనా?
ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ఖరారు చేస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల కోసం టీడీపీ వేట ప్రారంభించింది.
వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అందుకు తగ్గట్లుగా వ్యూహరచన చేసుకుంటూ వెళుతున్నారు. తన స్వభావానికి విరుద్ధంగా ఎన్నికలకు ఏడాది ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. గతంలో నామినేషన్లు వేసే చివరి రోజువరకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయకుండా తాత్సార ధోరణితో చంద్రబాబు వ్యవహరించేవారు.
తెలుగుతమ్ముళ్లు ఈ విషయాన్ని గమనంలో ఉంచుకొని తమ అధినేత మారాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరిగి పోటీచేయడానికి విశాఖపట్నం నుంచి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్, విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు లాంటి నేతలు ఉన్నప్పటికీ అనకాపల్లి, పాడేరు, అరకు, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం నియోజకవర్గాలకు అభ్యర్థులు లేరు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నవారు వేలిమీద లెక్కబెట్టగలిగేంత సంఖ్యలోనే ఉన్నారు. ఏలూరు నుంచి పోటీపడటానికి మాగంటి బాబు, మచిలీపట్నం నుంచి కొనకళ్ల నారాయణ ఉన్నప్పటికీ నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు నియోజకవర్గాలకు తిరిగి కొత్త అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అలాగే కడప నుంచి శ్రీనివాసులరెడ్డి, హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప, అనంతపురం నుంచి జేసీ పవన్, రాజంపేట నుంచి గంటా నరహరి, నంద్యాల నుంచి మాండ్ర శివానందరెడ్డి, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాలు ఖాళీగానే ఉన్నాయి.

వరుసగా మూడుసార్లు ఓటమిపాలైన సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో సీటిచ్చేది లేదని చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. ఇటువంటి సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ తరఫున వారసులను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వమని పుట్టా సుధాకర్ యాదవ్ (మైదుకూరు) కోరుతున్నారు. ఇతను యనమల రామకృష్ణుడు అల్లుడు కూడా కావడంతో దాదాపుగా టికెట్ ఖాయమనే ప్రచారం నడుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులు దొరకని పక్షంలో పలు ఎంపీ నియోజకవర్గాలకు సీనియర్ నేతల వారుసులే రంగంలోకి దిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications