వంటింట్లో కూడా, అమెరికాలో అలా: 'జై ఆంధ్రప్రదేశ్' అని నినదించిన కవిత
మనం వంటింట్లోకి వెళ్తే పాత్రల పైన తండ్రి పేరు కనిపిస్తుందని, కానీ తల్లి పేరు ఉండదని, మహిళా సాధికారత అవసరమని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం అన్నారు.
అమరావతి: మనం వంటింట్లోకి వెళ్తే పాత్రల పైన తండ్రి పేరు కనిపిస్తుందని, కానీ తల్లి పేరు ఉండదని, మహిళా సాధికారత అవసరమని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం అన్నారు. అమరావతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటులో ఆమె మాట్లాడారు.
దేశం కోసం ప్రాణత్యాగాలు చేయడంలో మహిళలు ముందున్నారని చెప్పారు. అమెరికాలో 200 ఏళ్లుగా మహిళా అధ్యక్షులు లేరని చెప్పారు. కానీ మన దేశంలో ఇందిరా గాంధీ ప్రధానిగా పని చేశారన్నారు. మహిళా స్వేచ్ఛ అన్నది మన రక్తంలోనే ఉందన్నారు.

భారత్ వంటి దేశాల్లో మహిళలు ఎలాంటి వృత్తిని అయినా చేపట్టవచ్చునని చెప్పారు. స్వాతంత్య్రానికి ముందే మన దేశానికి రుద్రమ దేవి వంటి మహారాణులు ఉన్నారని చెప్పారు. కానీ ఇప్పుడు మన దేశంలో హింస కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి అపర వైభవంగా తులతూగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ ప్రాంగణంలోకి నడిచివస్తుంటే గురజాడ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుందని గురజాడ చెప్పిన మాటను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

గురజాడ చాటిన ఆదర్శాన్ని సమాజం అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు. పశ్చిమ దేశాల్లోనూ మహిళలపై కనిపించని అద్దంలా ఆంక్షలు ఉన్నాయన్నారు. దేశం కోసం త్యాగాలు చేసి, నాయకత్వం వహించిన మహిళలు భారత్ సొంతమన్నారు.
భారత్లో 1960లోనే మహిళా నాయకత్వాన్ని అంగీకరించామని గుర్తుచేశారు. కొన్ని దేశాల్లో ఇప్పటికీ మహిళలు తమ ఓటుహక్కు వినియోగించుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. మద్యపాన నిషేధం కోసం ఉద్యమించిన రోశమ్మ స్ఫూర్తితో నాయకత్వ పటిమను మహిళలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ సంస్కృతిలో ఉన్న మంచి అంశాలను తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని కవిత అభిప్రాయపడ్డారు.
ఇంటికి రాణి అంటారని, ఆ తర్వాత వంటింటికి మహారాణి అవుతుందని, కానీ వంటింట్లో ఉన్న పాత్రల పైన కూడా నాన్న పేరు కనిపిస్తుంది కానీ మన అమ్మ పేరు కనిపించదన్నారు. చివరలో జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్ అంటూ కవిత ప్రసంగం ముగించారు.












Click it and Unblock the Notifications