విజయవాడ విమనాశ్రయానికి అదొక్కటి చేయండి: లోక్సభలో కేంద్రానికి ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: విజయవాడ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కేశినేని శ్రీనివాస్(నాని) కేంద్ర ప్రభుత్వం ముందుకు కీలక అంశాలను తీసుకెళ్లారు. బెజవాడ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్రంగా మారిందని, వీటి కోసం అంతర్జాతీయ విమానాశ్రయంలో సదుపాయాలు కల్పించాలని కోరారు. విజయవాడ విమానాశ్రయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సదుపాయాలపై లోక్సభ జీరో అవర్లో ఎంపీ కేశినేని నాని ప్రస్తావించారు.

వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రంగా విజయవాడ: ఎంపీ కేశినేని నాని
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సదుపాయాలను పెంచితే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. దక్షిణ భారత దేశంలో రెండు ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తున్నాయని తెలిపారు కేశినేని నాని. ఈ నదుల కారణంగా పరీవాహక ప్రాంతంలో సారవంతమైన భూముల్లో వ్యవసాయ ఉత్పత్తుల సామర్థ్యం కొన్ని శతాబ్దాలుగా పెరుగుతోందన్నారు. దీంతో విజయవాడ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్రంగా మారిందన్నారు.

వారణాసి ఎయిర్పోర్టు తరహాలో..: కేశినేని నాని
గుంటూరు మిర్చి, నూజివీడు మామిడి, పసుపు, పొగాకు, ఈ మధ్య మంచినీటి మత్స్య సంపద కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యం మరింత పెరిగిందని కేశినేని నాని వివరించారు. ఈ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మరింత సదుపాయాలు కల్పించేలా 'అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా)' చర్యలు చేపట్టాలని కోరారు. వారణాసి విమానాశ్రయం తరహాలో విజయవాడ విమానాశ్రయంలో కోల్డ్ స్టోరేజి, కస్టమ్స్ క్లియరెన్స్, ఫైటోశానిటరీ క్లియరెన్స్ వంటి సదుపాయాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు.
Recommended Video

విజయవాడకు అదొక్కటే లోటు.. చర్యలు తీసుకోండి: కేశినేని నాని
గతంతో పోలిస్తే.. ఇటీవల ఏపీలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. 2020-21లో అత్యధికంగా పరిమాణంలో 52 లక్షల మెట్రిక్ టన్నులు, విలువలో రూ. 13,700 కోట్ల మేర ఎగుమతులు జరిగాయని కేశినేని నాని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కానీ, విజయవాడ ప్రాంత వ్యవసాయ ఉత్పత్తులను సమీపంలోని ఏదైనా పోర్టు లేదా విశాఖపట్నం ఎయిర్పోర్టు ద్వారా ఎగుమతి చేయాల్సి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో విజయవాడ విమానాశ్రయంలో తగిన సదుపాయాలు కల్పిస్తే వ్యవసాయ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని కేశినేని నాని తెలిపారు. అంతేగాక, వేగవంతంగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి చేరుకోడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని, దీనికనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందని వివరించారు ఎంపీ కేశినేని నాని.












Click it and Unblock the Notifications