రాధా రెక్కీపై సీబీఐ విచారణ చేయాలి - కేంద్రానికి ఎంపీ కేశినేని లేఖ : తరలి వచ్చిన టీడీపీ నేతలు..!!
వంగవీటి రాధా రెక్కీ వ్యాఖ్యల తరువాత రాజకీయంగా సమీకరణాలు మారిపోతున్నాయి. వంగవీటి రాధా రెక్కీ వ్యాఖ్యలు..ఆ తరువాత సీఎం స్పందించి వెంటనే ఇద్దరు టు ప్లస్ టు గన్ మెన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించటం చకచకా జరిగిపోయాయి. రాధా తన పైన రెక్కీ జరిగిందని చెప్పిన సందర్భంలో అదే వేదిక పైన మంత్రి కొడాలి నాని.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. కొడాలి నాని నేరుగా సీఎంతో రాధా పేర్కొన్న రెక్కీ వ్యాఖ్యలు గురించి వివరించటంతో సీఎం స్పందించారు.
చంద్రబాబు పరామర్శతో కొత్త ట్విస్టు
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా వంగవీటి రాధా నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాజకీయంగా కొత్త ట్విస్టు ఇచ్చారు. దీనీ తరువాత పోలీసు అధికారులు రెక్కీ నిర్వహించినట్లుగా ఆధారాలు దొరకలేదని తేల్చి చెప్పారు. ఇక, చంద్రబాబు పరామర్శ తరువాత కొనసాగింపుగా ఈ రోజు టీడీపీ క్రిష్ణా జిల్లా ముఖ్యనేతలు రాధా నివాసానికి వెళ్లారు. తెలుసుకున్న ఎంపీ నాని,మాజీ మంత్రి నెట్టెం రఘురాం రాధాతో సమావేశమయ్యారు. రెక్కీ వ్యాఖ్యల నేపథ్యంలో వివరాలు ఆరా తీసారు. జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు.
తరలి వచ్చిన టీడీపీ నేతలు
ఆ తరువాత కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. వంగవీటి కుటుంబం రాష్ట్ర సంపదగా పేర్కొన్నారు. పేద ప్రజలకు వంగవీటి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. హత్యా రాజకీయాలకు ఎప్పుడు ఆనాడు ఎన్టీఆర్,చంద్రబాబు ఎప్పుడు ప్రోత్సహించలేదని వివరించారు. వంగవీటి రాధా మంచి వ్యక్తి అంటూ కితాబిచ్చారు. రాధా తాను నష్టపోతాడు కానీ ఎవరిని రాధా ఇబ్బంది పెట్టరని చెప్పుకొచ్చారు. విజయవాడ నగరాన్ని డిజిపి,సీపీ ప్రశాంతంగా ఉంచాలని కోరారు. రాధా రెక్కీ అంశంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేసారు.
Recommended Video
సీబీఐ విచారణ .. కేంద్రానికి లేఖ
తాను కేంద్ర ప్రభుత్వానికి ఒక ఎంపీగా లేఖ రాస్తానని వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి దృష్టికి రాధా పై రెక్కీ అంశాన్ని తీసుకువెళ్తానని నాని స్పష్టం చేసారు. పాత బెజవాడ రోజులు తీసుకురావద్దు అని పోలీసులను కోరుతున్నానని వ్యాఖ్యానించారు. పదవులు ఆశించే వ్యక్తి రాధాది కాదని చెప్పారు. వంగవీటి కుటుంబం రాజకీయాలు ఉన్నంతవరకు తెరమరుగు అవ్వదన్నారు. రంగా కుటుంబం పుట్టినప్పుడు మంత్రి వెల్లంపల్లి పుట్టి ఉండడన్నారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు.