రజినీకాంత్ దయచేసి చంద్రబాబును నమ్మొద్దు: ఎంపీ మార్గాని భరత్
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఎన్టీఆర్ ను, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును తనదైన శైలిలో ప్రశంసించారు. ఇక రజినీకాంత్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఆయనపై మండిపడుతున్నారు. తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రజినీకాంత్ ను, చంద్రబాబును టార్గెట్ చేశారు.
చంద్రబాబు ఎన్టీఆర్ పై చూపిస్తున్నది కపట ప్రేమ అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఎన్టీఆర్ పేరుతో శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎందరినో ప్రధాన మంత్రులను చేశానని , మరెందరికో భారతరత్న వంటి ప్రతిష్ఠాత్మక గౌరవాలు దక్కేలా చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారు అంటూ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజినీకాంత్ రావడం వెనుక ఆయన ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మార్గాని భరత్ పేర్కొన్నారు. సినిమారంగంలో గౌరవంతో పాటు మంచి ఇమేజ్ వున్న సూపర్ స్టార్ రజినీకాంత్ దయచేసి చంద్రబాబును నమ్మొద్దని మార్గాని భరత్ సూచించారు. ఏపీలో చంద్రబాబు రాజకీయాలు రజినీకాంత్ కు తెలియవని, అనవసరంగా రజనీకాంత్ చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని మార్గాని భరత్ సూచించారు.
మాట్లాడడం కూడా చేతగాని నారా లోకేష్ పప్పు అని, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ప్రజలు ఎవరైనా నమ్ముతారా అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు. చంద్రబాబుకి కొడుకు మీద నమ్మకం లేక పేమెంట్ ఇచ్చి మరీ అద్దెకొడుకును తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు బిజెపిపైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ మార్గాని భరత్ వైసీపీ పాలనపై బీజేపీ చార్జిషీట్ల పేరుతో కొత్త డ్రామాలకు తెర తీస్తోందని ఆరోపణలు గుప్పించారు.
గతంలో మట్టిని తవ్వి టిడిపి నాయకులు జేబులు నింపుకుంటే,ఇప్పుడు మట్టిని తవ్వే డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళుతుందని, ఈ విషయంపై ప్రజలు ఆలోచించాలని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోచుకున్నారని, అప్పుడు కూడా బీజేపీ ఛార్జిషీట్ లను వేసి ఉంటే బాగుండేదని మార్గాని భరత్ బిజెపి నేతలకు చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications