విచారణకు వస్తున్నా, అరెస్ట్ చేసుకోండి..!!
లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లిక్కర్ కేసులో ఈ రోజు సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఏ4 గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ రోజు విచారణకు సిట్ ముందుకు మిథున్ రానున్నారు. విచారణ తరువాత మిథున్ అరెస్ట్ చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, అటు మిథున్ అరెస్ట్ కోసం సిట్ వారెంట్ జారీకి కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ రోజు మొత్తంగా మిథున్ విషయంలో చోటు చేసుకునే పరిణామా ల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
కీలక పరిణామాలు
లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మిథున్రెడ్డిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై పరిశీలించిన కోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన మెమో, ఇతర పత్రాల జత చేయకపోవడాన్ని గుర్తించి రిటర్న్ చేసింది. సంబంధిత పత్రాలతో పిటిషన్ వేయాలని వెనక్కి పంపింది. అటు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ తరుణంలో మిథున్ ను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు వారెంట్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మిథున్రెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతాల్లో సోదాలు జరిపేందుకు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం అధికారులు ముందుకు వెళ్తున్నారు.

మిథున్ పాత్రపై
మిథన్రెడ్డిపై సిట్ అధికారులు ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ లిక్కర్ స్కాంకి వ్యూహరచన చేసి దానిని అమలు చేయడంలో పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కీలక పాత్ర పోషించారు. వైఎస్ జగన్కి ఈయన అత్యంత సన్నిహితుడుగా సిట్ పేర్కొంది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కెసిరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో వారు వసూలు చేసిన మొత్తాన్ని బిగ్బాస్కు చేర్చడంలో మిథున్రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ తేల్చింది. బహుళ అంచెల హవాలా నెట్వర్క్ రూపకల్పన, అమలు, పర్యవేక్షణ ఈయన కనుసన్నల్లోనే జరిగిందని నిర్ధారించింది. ఆధారాలు లభ్యం కావటంతో సిట్ అరెస్ట్ కు చట్ట పరంగా అన్ని చర్యలు తీసుకుంటోంది.
అరెస్ట్ తప్పదా
కాగా, ఈ రోజు సిట్ ఎదుట విచారణకు మిథున్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. విచారణకు రావాలని సిట్ పిలుపుతో మిథున్ రెడ్డి హాజరవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. విచారణ తరువాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అటు 300 పేజీలతో ఈ రోజు దాఖలు చేయనున్న ఛార్జ్ షీట్ లో ఎలాంటి అంశాలు పేర్కొంటారు.. అంతిమ లబ్దిదారుగా ఎవరిని చూపిస్తారనేది కీలకంగా మారుతోంది. మాజీ మంత్రి నారాయణ స్వామికి విచారణకు రావాలంటూ సిట్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో.. ఈ కేసులో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications