చంద్రబాబుతో రఘురామ సమావేశం - ప్రధానితో "ప్రత్యేక భేటీ" దిశగా...!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ప్రధాని అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలోనే చంద్రబాబు వద్దకు వైసీపీ ఎంపీ రఘురామ వచ్చరు. చర్చలు చేసారు. ఎంపీగా రాజీనామాకు రఘురామ ముహూర్తం నిర్ణయించారు. ఇదే అంశం పైన చంద్రబాబుతో రఘురామ చర్చించారు. ప్రధానితో చంద్రబాబు భేటీకి ప్రయత్నిస్తున్న వేళ ఈ సమావేశం ఆసక్తిగా మారింది.

టీడీపీ అధినేతతో రఘురామ సమావేశం
ఢిల్లీ పర్యటనకు వచ్చిన చంద్రబాబు తో రఘురామ భేటీ అయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ ఎంపీలోనూ రఘురామ కాసేపు ముచ్చటించారు. ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన విభజన హామీలతో పాటుగా ప్రత్యేక హోదా అంశం పైన ఏపీకి చెందిన ఎంపీలంతా పార్టీలకు అతీతంగా రాజీనామా చేయాలని రఘురామ ప్రతిపాదించారు. దీని పైన టీడీపీ ఎంపీల నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదు. చంద్రబాబు అప్పటికే పార్టీ ఎంపీలతో సమావేశానికి సిద్దం కావటంతో మరోసారి కలిసి చర్చించాలని నిర్ణయించారు. ఇదే డిమాండ్ పైన తాను రాజీనామాకు సిద్దంగా ఉన్నానని రఘురామ వెల్లడించారు.

రాజీనామాకు సిద్దమంటూ కొత్త ప్రతిపాదన
2019 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రత్యేక హోదా డిమాండ్ తో లోక్ సభ ఎంపీలు రాజీనామా చేసారు. కానీ, ఆ సమయంలో టీడీపీ కలిసి రాలేదు. ఇప్పుడు వైసీపీకి చెందిన 22 మంది..టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు కలిసి రాజీనామాలు చేయాలనేది రఘురామ ప్రతిపాదన. వైసీపీ రఘురామ ప్రతిపాదన పరిగణలోకి తీసుకొనే అవకాశం లేదు. వైసీపీ ముందుకు రాకుండా.. కేంద్రంతో గ్యాప్ పెరిగే నిర్ణయాలు ఇప్పుడు చంద్రబాబు తీసుకొనే పరిస్థితుల్లో లేరు. రెండు పార్టీల నుంచి స్పందన ఉండకపోవటంతో..రఘురామ రాజీనామా చేస్తారా అనేది సందేహమే. రఘురామ గతంలోనూ నర్సాపురం ఎంపీగా రాజీనామా చేస్తానని..ఇండిపెడెంట్ గా బరిలోకి దిగుతానంటూ ప్రకటనలు చేసారు. కానీ, ఆ తరువాత ఆ ప్రస్తావన తీసుకురాలేదు.

ప్రధానితో భేటీకి ప్రయత్నాల వేళ
ఇక, వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న పలు సందర్బాల్లో రఘురామను వైసీపీ వేధిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే విధంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉంటూ చంద్రబాబు -లోకేశ్ పైన చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, ఆయనను రాజ్యసభ కమిటీల నుంచి తొలిగించాలని రఘురామ రాజ్యసభ చైర్మన్ కు లేఖ రాసారు. ఇదే సమయంలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీకి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రఘురామ ప్రత్యేకంగా సమావేశం కావటం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. మరో రోజు ఢిల్లీలోనే చంద్రబాబు ఉండనుండటంతో..ఇప్పుడు ప్రధాని తో భేటీకి ఛాన్స్ ఉందా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications