ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయం - ప్రధానితో చర్చలు..!!
ఏపీలో మరోసారి ముందస్తు ఎన్నికల ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన వేళ ముందస్తు ఎన్నికల పైన చర్చకు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పుడు ఎంపీ రఘురామ రాజు ఇదే విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని జోస్యం చెప్పారు. ప్రధానితో సీఎం జగన్ ఇదే అంశం పై మాట్లాడినట్లు తెలిసిందని చెప్పుకొచ్చారు. దీని ద్వారా అయిదు రాష్ట్రాల ఎన్నికల తో పాటుగా ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయని చెప్పుకొచ్చారు.
డిసెంబర్ లోనే ఎన్నికలు:తెలంగాణతో పాటే ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయని రఘురామ అంచనా వేస్తున్నారు. వైసీపీ ఎంపీలు ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టించటానికి ముందస్తు ఎన్నికలు లేవని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు సీరియస్ గా తీసుకోకుండా ఎన్నికలకు సమాయత్తం కావదన్నది వారి భావనగా వివరించారు.

జగన్ ముందస్తుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి అదనపు సమాచారం బయటకు వస్తుందని రఘురామ రాజు పేర్కొన్నారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు లేవని చెప్పారంటే కచ్చితంగా ఉన్నట్లే భావించాలని రఘురామ స్పష్టం చేసారు.
కేంద్రం ముందస్తు ఆలోచనలు:ఏపీలో ముందస్తు ఎన్నికల పైన కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ దీని పైన క్లారిటీ ఇచ్చారు. ముందస్తుకు వెళ్లే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికలకు తొమ్మిది నెలల సమయం ఉందని..మంత్రులు యాక్టివ్ కావాలని సూచించారు.
ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వేళ తిరిగి ముందస్తు పైన ప్రచారం మొదలైంది. కేంద్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ సమీకరణాలతో కేంద్రం లోక్ సభకు ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతుందని తెలుస్తోంది. అయిదు రాష్ట్రాలతో పాటుగా మేలో జరగాల్సిన నాలుగు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు జరిగేలా ఆలోచన జరుగుతున్నట్లుగా ఢిల్లీ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి:షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్ లో లోక్ సభ ఎన్నికలతో పాటుగా ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్రంలో జరుగుతున్న కసరత్తు మేరకు..
అయిదు రాష్ట్రాలతో పాటుగానే ఈ నాలుగు రాష్ల్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలనేది ప్రస్తుత చర్చగా తెలుస్తోంది. కేంద్రం లోక్ సభ ఎన్నికలకు ముందస్తుగానే వెళ్లాలనుకుంటే సీఎం జగన్ ఏపీ అసెంబ్లీకి ముందస్తుకు సిద్దమేనని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని సైతం ముందస్తు ఎన్నికలకు వీలుగా తన కార్యాచరణ వేగవంతం చేసారనే విశ్లేషణలు ఉన్నాయి. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు డిసెంబర్ లోనే తెలంగాణతో పాటుగా ఏపీలోనూ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications